10 టీడీపీవే: కర్నూలులో జగన్కు షాక్, కడప ఊరట
హైదరాబాద్: జడ్పీ ఎన్నికల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లోని 11 జిల్లా పరిషత్ల పాలకమండళ్ల ఎన్నిక శనివారం ముగిసింది. 10 జడ్పీల్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడగా, కడప జడ్పీ మాత్రం వైయస్సార్ కాంగ్రెసు ఖాతాలో పడింది. కర్నూలులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి బలమున్నా, భారీ సంఖ్యలో ఆ పార్టీ జడ్పీటీసీలు గోడదూకడంతో టీడీపీ సునాయాసంగా జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంది.
ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జడ్పీ పాలక మండళ్ల ఎన్నిక వాయిదా పడింది. ఎన్నికలు ముగిసిన 11 స్థానాలకుగాను ఆరు చోట్ల మహిళలే జడ్పీ చైర్మన్ పీఠాలను అధిష్ఠించారు. మూడు చోట్ల వైస్చైర్మన్లుగా వారికి అవకాశం లభించింది. టీడీపీకి బలమున్న అన్ని జిల్లాల్లోనూ పాలకమండళ్ల ఎన్నికకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు గైర్హాజరయ్యారు. అన్ని చోట్లా పాలకమండళ్ల ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది.

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జడ్పీ పీఠాలను టీడీపీ ఏకగ్రీవంగా కైవశం చేసుకుంది. సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత విశాఖపట్నం జడ్పీని టీడీపీ దక్కించుకుంది. విజయనగరం జడ్పీ చైర్మన్గా తెలగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభ హైమావతి కుమార్తె స్వాతి రాణి ఎన్నికయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని జడ్పీ పీఠాలూ ఏకగ్రీవంగా టీడీపీ ఖాతాలో పడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత మూడోసారి జడ్పీ పీఠాన్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది.
కృష్ణా, గుంటూరు జడ్పీలపైనా పసుపు జెండా ఎగిరింది. గుంటూరు జిల్లాలో జడ్పీ చైర్మన్గా మైనార్టీ మహిళకు అవకాశం దక్కింది. ముస్లిం మహిళ జానీమూన్ను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టింది. చిత్తూరు జడ్పీ పీఠం సుమారు 14 ఏళ్ల తర్వాత టీడీపీ కైవసమైంది. జడ్పీ చైర్మన్గా శ్రీరామనేని గీర్వాణి, వైస్ చైర్మన్గా సుందర రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ కమ్మ, రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు.
అనంతపురం జడ్పీ పీఠంపై పదేళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది. గత జడ్పీ ఎన్నికల్లోనూ టీడీపీకి మెజారిటీ వచ్చినా అధికార కాంగ్రెస్ పార్టీ టీడీపీ సభ్యులను తమ వైపు తిప్పుకొని చైర్మన్గిరిని దక్కించుకుంది. అనంతపురం జడ్పీ చైర్మన్గా పరిటాల రవీంద్ర అనుచరుడు చమన్కి అవకాశం దక్కింది. కర్నూలులో హైడ్రామా మధ్య జెడ్పీ టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. జిల్లాలో 53 జడ్పీటీసీలకుగాను టీడీపీ 20, జగన్ పార్టీ 30, కాంగ్రెస్ 2, ఆర్పీఎస్ 1 గెల్చుకున్నాయి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన 12 మంది, ఆర్పీఎస్కి చెందిన ఒక జడ్పీటీసీ మూకుమ్మడిగా టీడీపీలోకి ఫిరాయించడంతో టీడీపీ బలం 32కి చేరింది. శుక్రవారం వీరంతా జిల్లాపరిషత్ ప్రాంగణానికి చేరుకోవడంతో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ జడ్పీటీసీలను తమకు అప్పగించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
అది తన పని కాదని కలెక్టర్ పేర్కొనడంతో వారు సభలో కలెక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని సభలో నినాదాలు చేస్తున్న ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఎస్వీమోహన్రెడ్డిలను బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం జడ్పీ చైర్మన్గా మల్లెల రాజశేఖర్, వైస్ చైర్మన్గా పుష్పావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, కడప జడ్పీ పీఠాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ టీడీపీ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీలను ఆకర్షించే ప్రయత్నం చేసినా కుదరలేదు.












Click it and Unblock the Notifications