ఎవరు టీడీపీ , ఎవరు వైసీపీ... సీఎస్ , డీజీపీలకు పార్టీల ముద్రలు! ఏపీలో దిగజారిన రాజకీయాలు
ఏపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. రాజకీయ పార్టీల వైరం అధికారుల మీద ప్రభావం చూపుతోంది. అధికార పార్టీ మద్దతిచ్చే అధికారులను ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేస్తుంటే...ప్రతిపక్ష పార్టీ మద్దతు ఉందనే భావనలో అధికార పార్టీ ఆ అధికారులను లక్ష్యంగా చేసుకుంటోంది. రాష్ట్రంలో కీలకమైన రెండు వ్యవస్థలను కంట్రోల్ చేసే ఆ బాస్లు ఇద్దరూ ఇప్పుడు ఏపీలోని రెండు ప్రధాన పార్టీల విమర్శలతో ఇబ్బంది పడుతున్నారు.
సీఎస్ లక్ష్యంగా టిడీపీ..
ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఏపీలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీఠాను మార్చి ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యంకు సీఎస్గా బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుండి ముఖ్యమంత్రి మొదలు పార్టీ నేతలు సీఎస్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన చేస్తున్న సమీక్షలు..తీసుకుంటున్న నిర్ణయాల పైన టిడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ఆయన్ను ఎన్నికల సంఘం సీఎస్గా అభివర్ణించారు. జగన్ కేసుల్లో సహ ముద్దాయి అయిన ఎల్వీని సీఎస్గా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక, ప్రతీ రాష్ట్రంలో సీఎస్ నేరుగా ముఖ్యమంత్రిని జవాబు దారీగా ఉంటారని..అయితే, ఎల్వీ మాత్రం ఎన్నికల సంఘానికి బాధ్యులుగా పని చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. దీంతో..విమర్శలు హద్దు మీరటంతో ప్రత్యేకంగా సమావేశమైన ఐఏయస్ అధికారులు తమ బాస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శేనని..ఆయన చెప్పినట్లే చేస్తామని తేల్చి చెప్పారు. ఆయనకు వైసీపీ మద్దుత ఉందంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
డీజీపీ లక్ష్యంగా వైసీపీ..
ఇక, ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ముందు నుండి వైసీపీ ఏపిలో పోలీస్ బాస్ పైనే గురి పెట్టింది. ఏపీ డీజీపీగా ఉన్న ఠాకూర్ పైన వైసీపీ చాలా రోజులుగా ఆరోపణలు గుప్పిస్తోంది. జగన్ పైన విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగిన సమయం నుండి ఈ ఆరోపణల పర్వం ప్రారంభమైంది. ఇక, వైసీపీ అధినేత జగన్ నేరుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఏపీ డీజీపీని ఎన్నికల విధుల నుండి తప్పించాలని కోరారు. అదే విధండా నిఘా బాస్ ఏబీ వేంకటేశ్వరరావు ను తప్పించాలని అభ్యర్దించారు. ఎన్నికల వేళ ఇంటలిజెన్స్ చీఫ్ను తప్పించిన ఎన్నికల సంఘం డీజీపీని మాత్రం తమ వద్దకు పిలిపించి వివరణ కోరింది. అయినా..వైసీపీ నేతలు ఆగలేదు. ఎన్నికల రోజు జరిగిన ఘటనల్లోనూ పోలీసుల వైఫల్యం ఉందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. సీఎస్ను టీడీపీ నేతలు కార్నర్ చేస్తుంటే..డీజీపీని వైసిపి నేతలు లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఎక్కడా లేని విచిత్ర పరిస్థితి...
ఏపిలోనే కాదు..ఏ రాష్ట్రంలోనూ లేని విచిత్ర పరిస్థితి ఇది. పాలనలో కీలకమైన రెండు విభాగాలకు చెందిన ఇద్దరు బాస్లను రాజకీయాల్లోకి లాగటం..ఇద్దరినీ రెండు పార్టీలు లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. చివరకు ఏపి ఎన్నికల ప్రదానాధికారిగా ఉన్న ద్వివేదీ విషయంలోనూ ఇదే రకంగా జరుగుతోంది. ఎన్నికల సంఘం పైనా విమర్శలు చేస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేసారు. ఇక, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..పోలీస్ బాస్ లకు వ్యతిరేక..మద్దుతగా నిలుస్తూ పాలనా వ్యవహారాలను పూర్తిగా దెబ్బ తీస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యి..కొత్త ప్రభుత్వ ఏర్పాటయ్యే దాకా ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది.