పరిషత్ ఎన్నికలు బహిష్కరణ దిశగా టీడీపీ: పోలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబుతో వాడీవేడి చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు కాక రేపుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తొలినాడే పరిషత్ ఎన్నికల నిర్వహణ పై కీలక నిర్ణయం తీసుకున్నారు నీలం సాహ్ని . ఇక తాజాగా ఎస్ఈసి నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని టిడిపి డిమాండ్ చేస్తున్న పాత ఎన్నికల నోటిఫికేషన్ ను కొనసాగిస్తూ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసి నిర్ణయం తీసుకోవడాన్ని టీడీపీ తీవ్రంగా తప్పు పడుతోంది . ఈ నేపథ్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన టిడిపి పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక చర్చ జరిగింది.
ఎన్నికలను బహిష్కరించాలని మెజార్టీ సభ్యుల అభిప్రాయం
టిడిపి పోలిట్ బ్యూరో సమావేశంలో నేతలు ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో టిడిపి అనుసరించాల్సిన విధానంపై నిర్ణయాధికారాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి వదిలేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. బలవంతపు ఏకగ్రీవాలు జరిగిన కారణంగా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తే , రాత్రికి రాత్రి పాత నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకోవడంపై పొలిట్ బ్యూరో సభ్యులు మండిపడ్డారు . మెజారిటీ టిడిపి నేతలు, ఎన్నికలను బహిష్కరించాలని సూచించారు. అభ్యర్థులు పోటీలో ఉన్న చోట కూడా వెనక్కి వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల బహిష్కరణ సబబు కాదన్న కొందరు సీనియర్ నాయకులు
సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, కూన రవికుమార్ తదితరులు మాత్రం అభ్యర్థులు ఇప్పటికే బరిలో ఉన్న కారణంగా వారి పరిస్థితి ఏమిటి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలను బహిష్కరించే నిర్ణయం సబబు కాదని వారు అన్నట్లు తెలుస్తోంది. 25 శాతం స్థానాలు ఏకగ్రీవం అయితే 75 శాతం స్థానాలలో అభ్యర్థులు పోటీలో ఉన్న కారణంగా ఎన్నికల పై పునరాలోచన చేయాలని వారు అన్నట్టు తెలుస్తోంది.
స్థానిక పరిస్థితుల దృష్ట్యా పోటీ చేసిన అభ్యర్తులకే నిర్ణయాధికారం ఇవ్వాలని సూచన
మరికొంత మంది నేతలు పోటీలో ఉన్న అభ్యర్థులకే స్థానిక పరిస్థితుల దృష్ట్యా నిర్ణయాధికారాన్ని వదిలేసి పార్టీపరంగా దూరంగా ఉండాలనే అభిప్రాయాన్ని సైతం వ్యక్తం చేశారు .కొందరు నేతలు ఎన్నికలను బహిష్కరించటమే సమంజసంగా ఉంటుందని, ఎన్నికల బహిష్కరణ పై అభ్యర్థులకు వివరించాలని, క్యాడర్ కూడా అర్థమయ్యేలా చెప్పాలని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు నిబంధనలు కూడా పట్టించుకోకుండా న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉండగానే రాత్రికి రాత్రి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం అధికార దుర్వినియోగం అని పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి నేతలు అభిప్రాయపడ్డారు.
అధినేత నిర్ణయమే శిరోధార్యం అన్న పోలిట్ బ్యూరో సభ్యులు .. చంద్రబాబు ప్రకటనపై ఉత్కంఠ
అధికార పార్టీతో ఎన్నికల సంఘం కుమ్మక్కై నిర్వహిస్తున్న ఎన్నికలను టిడిపి బహిష్కరించడమే సమంజసంగా వారు అభిప్రాయపడినట్లు సమాచారం. పోలిట్ బ్యూరో సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి అధినేత నిర్ణయమే శిరోధార్యమని తామంతా ఆయన తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఇక అందరి అభిప్రాయాలను తీసుకున్న తరువాత ఎన్నికల బహిష్కరణ పై పార్టీ అధిష్టానం ప్రకటన చేయనుంది. చంద్రబాబు పరిషత్ ఎన్నికలపై ఏ విధమైన ప్రకటన చేస్తారన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.