ఎవరి బండారం ఎవరు బయట పెడతారు: ఏపి లో బిజెపి - టిడిపి వైట్ పేపర్ వార్..
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ..టిడిపి వర్సెస్ బిజెపి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటి వరకూ కేంద్రా న్ని టార్గెట్ చేస్తూ ఏపి లో అధికార పార్టీ రాజకీయాలు చేస్తోంది. బిజెపి నేతలు రాష్ట్ర స్థాయిలో టిడిపిని..ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. అయితే, ప్రధాని మోదీ ఏపి పర్యటన ఖరారు కావటంతో..టిడిపి వ్యూహాత్మకంగా తమ విజయాలను..కేంద్ర సహా య నిరాకరణను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇదే సమయంలో..బిజెపి జాతీయ నాయకత్వం సైతం టిడిపి బండారం బయట పెడతామని హెచ్చరిస్తోంది..
ప్రధాని సభ ద్వారా వాస్తవాలు చెబుతాం..
రాష్ట్ర విభజన తరువాత ఏపి లో పగ్గాలు చేపట్టిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా శ్వేత పత్రాలను విడుదల చేసారు. మరోసారి ఈ నాలుగున్నారేళ్ల పాలన పై రంగాల వారీగా శ్వేత పత్రాలను విడుదల చేయాలని ఏపి సీయం నిర్ణయించారు. నరేంద్ర మోదీ జనవరి 6వ తేదీన రాష్ట్రానికి రాబోతుండటంతో ఈనెల చివరి వారం, లేదా జనవరి మొదటి వారంలో చంద్రబాబు శ్వేత పత్రాల విడుదల చేయటం ఆరంభిస్తారని సమాచారం. ప్రధాని తన సభలో రాష్ట్రానికి ఇచ్చిన సంస్థలు, నిధుల పై ఆయన ప్రజలకు వివరించడంతో పాటు, బీజేపీ ఎపీ అభివృద్దికి కట్టుబడి ఉందని చెప్పబోతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత..ఏపికి ఇచ్చిన హామీల్లో ఎంత వరకు అమలు చేసాము..ఏ మేర ఆర్దిక సాయం అందించాము..హోదా పై ఎవరు ఏం చెప్పారు..ఎన్డీఏ నుండి టిడిపి ఎందుకు విడిపోయిందనే అంశాలను వివరిస్తారని బిజెపి నేతలు చెబుతున్నారు. ప్రధాని సభ ద్వారా ..ఆ తరువాత జాతీయ నేతల సభలను సైతం ఏర్పాటు చేసి టిడిపి బండారాన్ని బయట పెడతామని బిజెపి నేతలు హెచ్చరిస్తున్నారు.
శ్వేత పత్రాల ద్వారా కష్టాన్ని వివరిస్తాం..
ఇక, ఇటు ప్రధాని సభ లక్ష్యాన్ని అంచనా వేసిన టిడిపి కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. కేంద్రం తో పాటుగా ఏపి లోని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టేందుకు శ్వేత పత్రాల ద్వారా వాస్తవాలను ప్రజల ముందు ఉం చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పారిశ్రామిక పురోగతి, వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య పరిశ్రమలో సాధించిన అభివృద్ది, రాజధాని, పోలవరం నిర్మాణం, రాయలసీమకు సాగు, తాగు నీరు, రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు..వంటి అంశాల పై వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. అదే విధంగా ఏపి విభజన చట్టం ప్రకారం ఏపికి రావాల్సింది..ఇప్పటి వరకు దక్కింది..హోదా అంశం తో పాటుగా కేంద్ర తీరును ఈ శ్వేత పత్రాల ద్వారా బయట పెట్టటానికి నిర్ణయించింది. దీంతో..రానున్న రోజుల్లో ఎవరి బండారం ఎవరు బయట పెడతారో..ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి..