ఫాంహౌస్ కిటుకేమిటో చెప్పాలంటే..: కెసిఆర్పై బాబు
చిత్తూరు: కేంద్రంలో మళ్లీ తమ పార్టీ చక్రం తిప్పుతుందని, పూర్వవైభవం వస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తిం చేశారు. చిత్తూరు జిల్లాలోని స్వగ్రామం నారావారిపల్లెలో ఆయన సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే, 30 స్థానాల్లో ఎలా గెలుస్తుందని ఆయన మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు.
కరువు, వరదలు వస్తే ఎక్కడికి వెళ్ళరు, ఏమీ చేయరు, ఏ పనీ చేయలేరు అసమర్థ సీఎంకు పార్టీపై ఆశ పుట్టిందని, పెట్టనీ చూద్దాం, రాజకీయంలో ఆటలు, క్రీడలు అన్నీ ఉంటాయనీ ఈ రాజకీయ క్రీడలను ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనే వార్తలపై అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఓ చరిత్ర ఉందని, జాక్పాట్ కొట్టారు, సీల్డు కవర్ ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు.
తమ పార్టీకి ఓ చరిత్ర ఉందని, తాను, తమ నాయకుడు ఎన్టీరామారావు చేయాల్సింది చేశామని, రికార్డ్ సృష్టించామని చంద్రబాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఫామ్ హౌస్లో కూర్చుని ఎకరాకు కోటి రూపాయాల సంపాదిస్తానని అన్నారు. ఆ కిటుకు అందరికి చెప్పమంటే అదే చెప్పారని అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తండ్రిని అడ్డం పెట్టుకుని రూ. లక్ష కోట్లు సంపాదించారని బాబు విమర్శించారు. దానికి ఏమంటే ఎవరు అవినీతిపరుడు కాదంటారని అంటాడన్నారు. వీటన్నిటినీ ప్రజలు ఆలోచించుకోవాలని, మీ జీవితాల్లో వెలుగు కవాలా? చీకటి కావాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇప్పుడు వాడుతున్న సెల్ఫోన్లు, నేషనల్ హైవేస్, ఎయిర్పోర్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని తమ పార్టీ ప్రభుత్వ చొరవేనని ఆయన అన్నారు. దాని వల్ల సంపద వచ్చిందని, తనకు ఏ ఆశలేదని, పదవిపై వ్యామోహం అంతకంటే లేదని స్పష్టం చేశారు. అప్పుడు ప్రధానిని చేస్తానంటే రెండు సార్లు వద్దేనే చెప్పానని అన్నారు. ఈ రాష్ట్రం, తెలుగుజాతి ముఖ్యమని, ఒక అజెండా ఉందని, అది చేయాలని వచ్చానని అన్నారు.