ఏపీలో ముందస్తు ఖాయమే!?: 2018లోనే ఎన్నికలన్న టీడీపీ ఎమ్మెల్సీ!
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశముందని, అదే గనుక జరిగితే 2018లో విజయం మనదేనని ఆయన ధీమాగా చెప్పారు.
కడప: ఓవైపు ప్రధాని మోడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదం.. మరోవైపు చంద్రబాబు లాంటి వారి నోట ముందస్తు ఎన్నికల సంకేతాలు.. ఇవన్ని చూస్తే 2018లోనే ఎన్నికలు తథ్యం అనిపించే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవలి టీడీపీ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడినట్లు వార్తలు రావడంతో.. ఇక ఏపీలో 2018లో ఎన్నికలు జరగడం ఖాయమన్న వాదన వినిపించింది.
దీనికి తోడు జనసేన కూడా ముందస్తు ఎన్నికలకు సిద్దమంటూ ఓ ప్రకటన ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు అధికార పార్టీ నేత నోటి వెంట ముందస్తు ఎన్నికల మాట వినిపించింది. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దొరబాబు జిల్లా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ముందస్తు ఎన్నికల వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశముందని, అదే గనుక జరిగితే 2018లో విజయం మనదేనని ఆయన ధీమాగా చెప్పారు. టీడీపీ కార్యకర్తలు, నేతలంతా సైనికుల్లా పనిచేస్తే పార్టీకి మరోమారు విజయం దక్కడం తథ్యమని అన్నారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ కుటుంబంపై ప్రత్యక్ష యుద్దం చేసి గెలిచామని చెప్పుకొచ్చారు.
ఇక సమావేశానికి అధ్యక్షత వహించిన కమలాపురంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పుత్తానరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తమ నియోజకవర్గంలో ప్రభుత్వం ఇప్పటికే రూ. 900 కోట్ల రూపాయలను అభివృద్ధి పనుల కోసం వెచ్చించిందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని అన్నారు.