నంద్యాలలో మెజార్టీ గెలుపు, సర్వేలూ చెప్పాయి: బాబు, కాకినాడపై ఇలా
నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు.
అమరావతి: నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నికల్లో కనబర్చిన ఉత్సాహం కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ నేతలు కొనసాగించాలని సూచించారు.

భారీ మెజార్టీ అంటున్న సర్వేలు
కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలపై మంత్రులు, క్లస్టర్ కోఆర్డినేటర్లు, 1400 మంది బూత్ కమిటీ సభ్యులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నంద్యాలలో మంచి ఫలితం సాధించబోతున్నామని స్పష్టం చేశారు. టీడీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయన్నారు.

వేగం పెంచాలి...
కాకినాడ ఎన్నికల్లో నేతలంగా కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మిత్రపక్షం బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కూడా కృషి చేయాలన్నారు. ప్రచారానికి ఇంకా మూడు రోజులే ఉన్నందున.. నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారవేగం పెంచాలని, మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

కాకినాడలో రెండ్రోజుల ప్రచారం
కాగా, చంద్రబాబునాయుడు రెండు రోజులపాటు కాకినాడలో పర్యటించనున్నారు. ఆగస్టు 26, 27 తేదీల్లో ఆయన కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయనున్నారు. రెండు రోజులపాటు రోడ్షోలు, సభలు, సమావేశాలు ద్వారా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు కాకినాడ చేరుకుంటారు.

బాబు పర్యటన ఇలా..
నాగమల్లితోట కూడలిలో సభ నిర్వహిస్తారు. 47, 49, 50 డివిజన్లకు సంబంధించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ రోడ్షో ద్వారా ఓటర్లను కలుసుకుంటారు. అనంతరం ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులోని ఆర్టీవో కార్యాలయం కూడలి మీదుగా డీ-మార్ట్ వద్ద సభ నిర్వహిస్తారు. అక్కడ్నుంచి బయలుదేరి డెయిరీ ఫారం కూడలి వద్ద సభ నిర్వహిస్తారు. తర్వాత కల్పన కూడలి మీదుగా మొయిన్రోడ్డు, మసీదు కూడలి నుంచి బాలాజీచెరువు సెంటర్కు చేరుకుని సభ నిర్వహిస్తారు.
అక్కడ్నుంచి భానుగుడి కూడలికి చేరుకుని సభ నిర్వహిస్తారు. రాత్రికి అచ్చంపేట కూడలికి సమీపంలోని ఏడీబీ రోడ్డులోని ఒక ఫంక్షన్ హాల్లో బస చేస్తారు. ఆదివారం ఉదయం 9 గంటలకు అక్కడే వివిధ సామాజిక వర్గాలు ప్రతినిధులతో సమావేశమవుతారు. మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి జగన్నాథపురంలోని 13 డివిజన్లకు సంబంధించి సాయంత్రం 5 గంటల వరకూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు చంద్రబాబు.












Click it and Unblock the Notifications