కిరణ్ జోరుపై లెక్కలు: సీమాంధ్రపై బాబు, జగన్ స్కెచ్
బహిష్కృత కాంగ్రెస్ ఎంపీలతో కిరణ్ కొత్త పార్టీకి ప్రణాళిక ఖరారు చేస్తున్నారు. అయితే, కిరణ్ పార్టీ పెడితే అందులో లగడపాటి, సబ్బం, హర్ష కుమార్, ఉండవల్లి వంటి కీలక నేతలు చేరుతారు. దీంతో ఆ పార్టీ ప్రభావం ఉంటుందంటున్నారు. ప్రస్తుతం ప్రజల్లో బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం కొద్దిగా ముందంజలో ఉందంటున్నారు. బిజెపి పార్లమెంటులో విభజన విషయంలో తమ పట్ల అన్యాయంగా వ్యవహరించదనే ఆగ్రహం సీమాంధ్రలో ఉంది.
దీంతో బిజెపితో పొత్తుకు టిడిపి సాహసించడం లేదు. అయితే, నరేంద్ర మోడీ ప్రభావం ఉంది. దీంతో చివరి నిమిషంలో బిజెపితో టిడిపిపొత్తుపెట్టుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జనాకర్షణ ఉన్న నేత. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ ఉంది. విభజన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ నుండి టిడిపితో పాటు జగన్ పార్టీలోకి జోరుగా వలసలు ఉంటున్నాయి. అయితే పార్టీలో విధివిధానాలపై స్పష్టత లేదనే వాదన ఉంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు లేదా తర్వాత తెలుగుదేశం లేదా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలో ఏదో ఓ పార్టీ బిజెపికి పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటున్నారు. మోడీ ప్రభావం వల్ల నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఓట్లను కొల్లగొట్టవచ్చునని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.