మహిళల కంట నీరు, టెక్కీని రక్షించలేకపోయింది: బాబు
హైదరాబాద్: యూపిఏ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సామాజిక వెబ్సైట్ ట్విట్టర్లో మరోసారి మండిపడ్డారు. ఉల్లిగడ్డ ధరలు చూస్తుంటే మహిళల కంట నీరు వస్తోందన్నారు. యూపిఏ తీసుకు వచ్చిన నిర్భయ చట్టం సాఫ్టువేర్ ఇంజనీర్ ఉద్యోగిని కాపాడలేకపోయిందన్నారు.
కిలో ఉల్లిగడ్డ ధర రూ.90కి చేరుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఉల్లి కొనాలంటే మహిళల కళ్లలో నీళ్లు వస్తున్నాయన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, కేంద్ర ప్రభుత్వం మాటలు చేతల్లో తప్ప మాటల్లో కనిపించడం లేదన్నారు.
కాగా, వారం రోజుల క్రితం చంద్రబాబు ట్విట్టర్లో ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పైన భగ్గుమన్న విషయం తెలిసిందే.
దిగ్విజయ్ సింగ్ను మధ్యప్రదేశ్లో తరిమి కొడితే ఆంధ్ర ప్రదేశ్కు వచ్చి పెత్తనం చెలాయిస్తున్నారని, ఎపిలో పునరావాసం కోసం దిగ్విజయ్ సింగ్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ తరిమికొడితే ఇక్కడ తిష్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అసమర్థతకు, అవినీతికి ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని విమర్శించారు.
హైదరాబాదులో మూడు గంటలు, పట్టణాలలో ఆరు గంటలు, గ్రామాలలో పన్నెండు గంటల విద్యుత్ కోత విధిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ శాఖకు అసలు మంత్రే లేరని ఎద్దేవా చేశారు.