ప్రభుత్వ బడుల్లో సాంకేతిక విద్య.. ఏపీలో మారుతున్న విద్యా ప్రమాణాలు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మనబడి నాడు-నేడు అనే కార్యక్రమంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. దీంతోపాటు అమ్మఒడి పథకం కింద రూ.15వేలు ఇస్తుండటంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరిక సంఖ్య కూడా పెరిగింది. ఈ క్రమంలో జూన్ 12న 'జగనన్న విద్యా కానుక' పథకం కింద 43.10 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ విద్యారంగంలో మార్పు తీసుకురావటంలో తమ ప్రభుత్వం ముందుందని అన్నారు. విద్యారంగాన్ని రానున్న రోజుల్లో ప్రక్షాళన చేస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాల స్థాయి నుంచే సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, ఐఎఫ్పీ స్క్రీన్లు, స్మార్ట్ పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. మరి వాటి వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఆయా సాంకేతికత ఏ విధంగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అన్న అంశాలపై ప్రత్యేక కథనం.

ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్స్..
ఇప్పటివరకు ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్లాక్ బోర్డుపైన ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ బ్లాక్ బోర్డు స్థానంలో IFPలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ IFP స్క్రీన్లు ఆడియో వీడియో కంటెంట్లను ప్లే చేయడానికి, స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి.
ఇటువంటి పరికరాలు ఇప్పటికే కొన్ని ప్రైవేట్ మరియు అంతర్జాతీయ పాఠశాలల్లో వాడుకలో ఉండగా.. త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇదే జరిగితే.. బోధనా తీరు మరింత ఎఫెక్టీవ్గా మారే అవకాశం ఉంది. విద్యార్థులు ఏమైనా ప్రశ్నలు అడిగినా వెంటనే గూగుల్లో సెర్చ్ చేసి వారి అన్ని డౌట్లను పరిష్కరించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు డిజిటల్ బోధన వల్ల పిల్లలు ఆ అంశాన్ని ఎక్కువ రోజులు గుర్తుంచుకునే వీలుంటుంది.

పేదలకు ఉచితంగా స్మార్ట్ విద్య..
గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు టెక్నాలజీ, ఆన్లైన్ మధ్యమాలను అందించటం ద్వారా డిజిటల్ యుగంలో వెనుకబాటుతనం లేకుండా మార్చవచ్చు. ఎప్పటికప్పడు వచ్చే ట్రెండ్స్ కి తగ్గట్టు అప్డేట్ గా ఉండటానికి, వారు మరింత విజయవంతం కావడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
పాఠ్యాంశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, లాంగ్వేజ్, చాట్ జీపీటీ వంటి అంశాలను ప్రవేశపెట్టేందుకు అధికారులు కృషి చేస్తున్నారని సీఎం తెలిపారు. ఇవే అందుబాటులోకి వస్తే.. భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి వీలుంటుంది. అంతేకాకుండా.. రాష్ట్రంలోని విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలకు దీటుగా నిలచే అవకాశం ఏర్పడుతుంది.
పాఠ్యాంశాలలో AI...
పాఠశాలల్లో ఆధునిక ఉపకరణాలు ప్రవేశపెట్టడంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్, చాట్ జీపీటీని పాఠ్యాంశాల్లో చేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం ప్రకటించారు. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ దీనిపై నివేదిక సిద్ధం చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో హైస్కూల్ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి కాన్సెప్ట్లను బోధించడం వల్ల ప్రపంచ స్థాయిలో అవకాశాలపై అవగాహన కలుగుతుందని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు.
విదేశీ విద్య కోసం TOEFL శిక్షణ...
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనేక విదేశీ విద్యాసంస్థల్లో ప్రవేశ పరీక్షా అవసరమైన TOEFLలో 3 నుంచి 9 తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు యునైటెడ్ స్టేట్స్ ఆధారిత సంస్థ ETS (ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్)తో ఎంయూ (మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్)పై యూఎస్, యూరోపియన్ దేశాలు సంతకం చేశాయి. 2019-20లో, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలతో సహా మొత్తం 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా మాధ్యమంగా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ప్రతి జిల్లాలో ఇద్దరు ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని అమెరికా దేశం పంపి ఆంగ్ల భాషా బోధనా నైపుణ్యాల పై ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని ఇటీవల సీఎం తెలిపారు.

కంప్యూటర్ విద్యకు ప్రాధాన్యం
దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్ విద్య కూడా అందకుండా పోయింది. అయితే ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల స్థాయికి చేర్చే విధంగా దృష్టి సారిస్తోందని అన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. నాడు - నేడు పథకం కింద పాఠశాలలను ఆధునీకరించేందుకు రూ.16,000 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పిన ఆయన.. డిజిటల్ బోధనపై ప్రస్తుతం దృష్టి సారించామన్నారు.

విప్లవాత్మక మార్పులు ఇవే.. -
ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాల ద్వారా పాఠశాలలో పిల్లలు విద్యనభ్యసించే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయని చెప్పారు కాకినాడ జడ్పీ హైస్కూలు ఇంగ్లీష్ టీచర్ ప్రసాద్ గంటా. IFPలు వాడటం ద్వారా పిల్లలకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా ఎంతో సాంకేతిక జ్ఙానాన్ని పెంపొందిస్తోందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications