చంద్రబాబుతో భేటీ: టిఆర్ఎస్ వైపే తీగెల కృష్ణారెడ్డి?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు తీగెల కృష్ణా రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి మారే విషయంలో మనసు మార్చుకోలేదని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీగెల కృష్ణా రెడ్డిని పిలిచి మాట్లాడినప్పటికీ ఫలితం పెద్దగా కనిపించలేదని అంటున్నారు.
చంద్రబాబుతో మంగళవారం సమావేశమైన తర్వాత తీగెల కృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో చెప్పిన విషయాలను బట్టి ఆయన తెలుగుదేశంలో కొనసాగుతారనేది అనుమానంగానే ఉంది. కార్యకర్తల అభిష్టం మేరకు పార్టీ మారడంపై నిర్ణయం తీసుకుంటానని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే తీగెల కృష్ణారెడ్డి చెప్పారు.
మంగళవారం ఉదయం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తీగెల సమావేశం అయ్యారు. చంద్రబాబు నాయుడు జనరల్గా పిలిచారని, పార్టీ నిర్మాణాత్మకంపైనే మాట్లాడామని చెప్పారు. కార్యకర్తలతో సమావేశమై వారి మనోభావాలకు అనుగుణంగా పార్టీ మారడంపై నిర్ణయం తీసుకుంటామని ఓ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.
పార్టీ మారె విషయమై తమ మధ్య చర్చలు జరగలేదని తీగెల తెలిపారు. దసరా తర్వాత తీగెల కృష్ణా రెడ్డితో పాటు మరింత మంది తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతారని ముమ్మరంగా ప్రచారం సాగుతోంది.