హిందూపురం లాడ్జిలో అసలేం జరిగింది?: మేనమామే అత్యాచారం చేశాడా?
అమరావతి: అనంతపురం జిల్లాలోని హిందూపురం పట్టణంలోని సాయితేజ లాడ్జిలో జరిగిన అత్యాచార ఘటనపై బాధితురాలు నిజాలను వెల్లడించింది. వివరాల్లోకి వెళితే సాయితేజ లాడ్జిలో ఓ యువతి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని లాడ్జి సిబ్బంది గుర్తించి పోలీసులకు సమచారం అందించారు.
దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమె కోలుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు వెల్లడించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి నుంచి డీఎస్పీ పలు వివరాలు ఆరా తీశారు. తన మేనమామ బాబు, తనకు మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకు వచ్చి తనపై అత్యాచారం చేశాడని చెప్పింది.
యువతి అనంతపురంలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమెతోపాటు లాడ్జికి వచ్చిన వ్యక్తి బాబు అని, యల్లనూరు మండలం కూచివారిపల్లి అని చెప్పింది. అతనితో ఆరోతరగతి నుంచి పరిచయం ఉందని అతను సమీప బంధువని చెప్పింది. అతని లైంగిక కోర్కె తీర్చేందుకు తాను సహకరించక పోవడంతో తీవ్రంగా కొట్టి గాయపరిచాడని తెలిపింది.
ఆపై చంపబోయాడని ఆరోపించింది. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా, రొద్దం మండలానికి చెందిన బాబు అనే యువకుడితో కలిసి యువతి లాడ్జికి వచ్చినట్టు లాడ్జి సిబ్బంది చెపుతున్నారు. అయితే లాడ్జీలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందా? లేక సామూహిక అత్యాచారం జరిగిందా? అన్న విషయం స్పష్టంగా చెప్పటం లేదని డీఎస్పీ తెలిపారు.
అయితే నిందితుడికి సంబంధించి సమాచారం రావటంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని పట్టుకొనేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. బాధితురాలు పూర్తిగా కోలుకొన్న తర్వాతే వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
నిందితుడిని పట్టుకొనేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా బాధితురాలి పూర్తి వివరాలు సేకరించేందుకు మరో బృందాన్ని అనంతపురానికి పంపిపామని వివరించారు. కాగా, బాధితురాలిని ఆదివారం ఉదయం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్, మున్సిపల్ఛైర్పర్సన్ రావిళ్లలక్ష్మి తదితరులు పరామర్శించారు.