అమరావతిపై కేసీఆర్ సంచలనం: చంద్రబాబుకు అప్పుడే చెప్పా : జగన్కు చెప్పటంతోనే ఇలా..!!
ఏపీలో రాజధానిగా అమరావతి కొనసాగింపు పైన రగడ కొనసాగుతుండగానే..తెలంగాణ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి నిర్మాణం పైనే ఆయన వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తాను సూచనలు చేసానని..అయినా వినలేదని చెప్పుకొచ్చారు. దీని ద్వారా కేసీఆర్ అవే వ్యాఖ్యలు సైతం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూ చెప్పారా అనే చర్చ మొదలైంది.
కేసీఆర్ సూచనల మేరకే జగన్ అమరావతిలో వ్యవహరిస్తున్నారా అనే సందేహాలు పొలిటికల్ సర్కిల్స్ లో మొదలయ్యాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అమరావతి నిర్మాణాలు నిలిపివేసారు. 25 శాతం పూర్తి చేసుకోని నిర్మాణాలను రద్దు చేసారు. తాజాగా ఆర్దిక మంత్రి బుగ్గన అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటూ తేల్చి చెప్పారు. అయితే..ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అమరావతి పైన మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలు ఒకే విధంగా ఉన్నాయనే అభిప్రాయం కలుగుతోంది.

కట్టకయ్యా.. వేస్ట్ అని బాబుకు చెప్పా...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ రాజధాని అమరావతి గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. అమరావతి నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ డెడ్ ఇన్వెస్ట్ మెంట్గా అభివర్ణించారు. తెలంగాణ శాసనసభలో ఎత్తిపోతలకు కరెంటు బిల్లులపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జయప్రకాశ్ నారాయణ.. ఆయనెవరో నాకు అర్థం కాలేదు. ఆయనేదో పెద్ద కత చేసి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయనకేం అవసరం. ఔరోకి షాదీమే అబ్దుల్లా బేగానా.. అన్నట్లు ఆయనది మన రాష్ట్రం కాదు, మన్ను కాదు. బాధ కలుగుతుంది అధ్యక్షా, ఇదంతా వేస్టు అంటడు ఆయన. పక్క రాష్ట్రంలో రూ.53 వేల కోట్లతో అమరావతి కడుతుంటే దాన్ని డప్పు కొడతానంటాడు. అహో, ఓహో అని. అది డెడ్ ఇన్వె్స్టమెంట్. కట్టవచ్చునా అధ్యక్షా. ఆ చంద్రబాబు నాయుడికి కూడా చెప్పా.. కట్టకయ్యా వేస్టు అని. రాయలసీమకు నీళ్లు తీసుకుపో అని చెప్పా. కట్టిండు. ఆయంత ఎల్లకిలాబడ్డడు. పరిణామం ఏంటో తెలిసింది..అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీని ద్వారా కొద్ది రోజుల క్రితం బొత్సా అమరావతి ముంపు ప్రాంతమని..అక్కడ నిర్మాణాలకు భారీగా ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చారు. దీని పైన ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. అక్కడ వేల కోట్లతో నిర్మాణాలు ప్రారంభిస్తే వరద బూచి చూపి రాజధాని నిలిపివేసారని విమర్శించారు. అయితే, ఇప్పుడు కేసీఆర్ అమరావతి నిర్మాణం డెడ్ ఇన్వెస్ట్ అని చెప్పటం ద్వారా తాను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మాత్రం వివరించలేదు. అయితే, కేసీఆర్ సైతం తాజాగా బొత్సా వ్యక్తం చేసిన అభిప్రాయాన్నే చంద్రబాబుతో షేర్ చేసుకున్నారా అనే ఆసక్తి కర చర్చ సాగుతోంది.

జగన్ తోనూ అదే చర్చించారా..అందుకే ఇలా..
ఏపీలో టీడీపీ ఓడి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సఖ్యతగా ఉంటున్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా నీటి పంపకాల మీద చర్చలు చేసారు. అయితే, చంద్రబాబుతో అమరావతి నిర్మాణం వద్దని చెప్పానని స్వయంగా కేసీఆర్ వెల్లడించారు. అప్పుడు చెప్పిన కేసీఆర్..తనతో సన్నిహితంగా ఉంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కు సైతం చెప్పి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే, సెంటిమెంట్ తో ముడి పడి ఉండటంతో ముఖ్యమంత్రి జగన్ నేరుగా నిర్మాణాలు ఆపివేస్తున్నట్లుగా చెప్పకుండా.. అవినీతి జరిగిందంటూ 25 శాతం లోపు జరిగిన నిర్మాణాలను నిలుపుదల చేసారు. ఆర్దిక మంత్రి బుగ్గన సింగపూర్ కేంద్రంగా రాజధాని నిర్మాణానికి తమ వద్ద డబ్బులు లేవని తేల్చి చెప్పారు.
Recommended Video

అమరావతి నిర్మాణాల పైన
జగన్ తో కేసీఆర్ అదే అభిప్రాయం వ్యక్తం చేసి ఉంటే..ఖచ్చితంగా జగన్ అమరావతి నిర్మాణాల పైన నిపుణుల సలహాలు సైతం తీసుకుంటారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. అయితే.. అమరావతి నగర శంకుస్థాసన కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం హాజరయ్యారు. అదే వేదిక నుండి తెలంగాన ప్రభుత్వం నుండి కొంత విరాళం ప్రకటిద్దామని తాను అనుకున్నా..ప్రధాని ఎటువంటి నిధుల కేటాయింపు ప్రకటించకుండా తాను ప్రకటించటం సరి కాదనే అభిప్రాయంతో మిన్నకుండిపోయానని కేసీఆర్ తరువాతి కాలంలో చెప్పుకొచ్చారు. ఇక..ఇప్పుడు ఏపీలో అమరావతి రాజధానిగా కొనసాగటం పైన రగడ సాగుతున్న సమయంలో కేసీఆర్ వ్యాఖ్యలతో రాజకీయంగా మరో టర్న్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications