జగన్ను రాంగ్ హ్యాండిల్ చేశారు..: అసెంబ్లీలో కేసీఆర్ సంచలనం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవ్వాళ ముగియనున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రసంగిస్తోన్నారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలు, ఇతర అంశాలను ఆయన ప్రస్తావించారు. రాష్ట్రాభివృద్ధి విషయానికి సంబంధించిన విషయాలను కేసీఆర్ సభ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఘాటు విమర్శలు సంధించారు. కాంగ్రెస్, బీజేపీ.. తెలంగాణను అన్యాయం చేశాయని ఆరోపించారు. 50 సంవత్సరాల పాటు తెలంగాణ సమాజం దోపిడీకి గురైందని ధ్వజమెత్తారు. ఎన్నో వనరులు ఉన్నప్పటికీ.. సమగ్రంగా అభివృద్ధి చేయడంలో విఫలం అయ్యాయని అన్నారు.

బీజేపీ కూడా తెలంగాణ సమాజాన్ని కించపరిచిందని కేసీఆర్ విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని పేర్కొన్నారు. ఎన్నో హామీలను ఇచ్చి.. ఇప్పటికీ వాటిని నెరవేర్చట్లేదని అన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తరువాతే ఇక్కడి వనరులను సద్వినియోగం చేసుకున్నామని, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును నిర్మించుకోగలిగామని చెప్పారు.
ఈ సందర్భంగా కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తన ప్రసంగంలో ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డినీ గుర్తు చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నుమూసిన తరువాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా వేధింపులకు గురి చేసిందని అన్నారు.

దీనితో ఆయన సొంతంగా పార్టీని స్థాపించుకున్నారని, రికార్డుస్థాయి మెజారిటీతో విజయం సాధించారని కేసీఆర్ నిండు సభలో ప్రశంసించారు. కడప లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో అయిదు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారని అన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో స్వీప్ చేశారని, దీనితో ఆంధ్రాలో కాంగ్రెస్ పని అయిపోయిందని కేసీఆర్ చెప్పారు.
కేటీఆర్ కూడా వైఎస్సార్, జగన్ పేర్లను ప్రస్తావించిన విషయం తెలిసిందే. దిశ సంఘటన చోటు చేసుకున్న తరువాత తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాల గురించి జగన్.. ఏపీ అసెంబ్లీలో గుర్తు చేసుకున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ను నిండు సభలో సెల్యూట్ చేశారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీని అమలు చేశారని, అది లక్షలాదిమందికి ఉపయోగపడుతోందని ప్రశంసించారు.












Click it and Unblock the Notifications