రాజయ్య వ్యాఖ్యలపై కాంగ్రెసు ఫైర్: కెసిఆర్పై రసమయి గానం
హైదరాబాద్: డిప్యూటీ ముఖ్యమంత్రి రాజయ్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెసు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యల విషయంలో రాజయ్య శనివారం తెలంగాణ శాసనసభలో సోనియాపై వ్యాఖ్య చేశారు. దీనిపై కాంగ్రెసు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. రాజయ్యతో క్షమాపణ చెప్పించాలని కాంగ్రెసు సభ్యులు డిమాండ్ చేశారు.
దీంతో స్పీకర్ మధునూదనాచారి సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత మధుసూదనాచారితో కాంగ్రెసు సభ్యులు సమావేశమయ్యారు. తన జన్మదినం రోజున తెలంగాణ ప్రకటన చేసినప్పుడే రాష్ట్రాన్ని ఇచ్చి ఉంటే ఇన్ని ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావని రాజయ్య అన్నారు. సోనియాపై రాజయ్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ మధుసూదనాచారి కాంగ్రెసు సభ్యులకు హామీ ఇచ్చారు.
సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సభ సద్దు మణగలేదు. సోనియాపై రాజయ్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెసు సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ సాధ్యమయ్యేదా, తెలంగాణ ఇచ్చిన సోనియాకు మీరిచ్చే గౌరవం ఇదేనా అని కాంగ్రెసు సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. దీనికి రాజయ్య వివరణ ఇచ్చారు. సోనియాపై తనకు గౌరవం ఉందని, అడగకుండానే తనకు వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో టికెట్ ఇచ్చారని, వారిద్దరిపై తనకు గౌరవం ఉందని ఆయన అన్నారు.
కాంగ్రెసు తెలంగాణ ఇచ్చిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అప్పట్లో అన్నారని, అందుకు సోనియాకు కెసిఆర్ కృతజ్ఞతలు కూడా తెలిపారని రాజయ్య గుర్తు చేశారు. సోనియాపై రాజయ్య చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి తెలిపారు.
ఇదిలావుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుడు రసమయి బాలకిషన్ పాట పాడి వినిపించారు. ఇతర పాటలు కూడా పాడారు. కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఈ రోజును గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అందుకు అభ్యంతరం చెప్పిన తెలుగుదేశం పార్టీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావును వ్యతిరేకిస్తూ ఆయన పాటలు పాడారు.
ఉద్యమంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ముందు నడిచి ప్రజలను భాగస్వాములను చేశారని ఆయన అన్నారు. ఈ రోజును ప్రత్యేకంగా గుర్తు చేసుకోవపాలని, ఇది తెలంగాణ కోసం కెసిఆర్ ప్రాణాన్ని ఫణంగా పెట్టిన రోజు అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు లేరని, ఈ రోజే లేకుంటే మనమంతా ఇక్కడ ఉండేవాళ్లం కాదని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, తెరాసలో చేరిన శాసనసభ్యుడు తీగెల కృష్ణారెడ్డిపై స్పీకర్కు ఎర్రబెల్లి దయాకర్ రావు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశామని, అయితే తమ పార్టీ తరఫున గెలిచిన తీగెల కృష్ణారెడ్డి వాకౌట్ చేయలేదని ఆయన అన్నారు.