అసెంబ్లీ పంపకున్నా ఫిబ్రవరిలో టి: వ్యూహ, ప్రతివ్యూహాలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఈ నెల 23వ తేదీలోపు తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయం పంపించినా, పంపకపోయినా ఫిబ్రవరిలో పార్లమెంటులో బిల్లు పెట్టనున్నారట. ఇందుకు సంబంధించి హోంశాఖ కసరత్తు చేస్తోందని సమాచారం. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సిఎస్కు హోంశాఖ లేఖ రాసింది. ఫిబ్రవరిలోనే తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెడతామని ఆ లేఖలో పేర్కొన్నారు.
బిల్లుపై 23వ తేదీలోగా అసెంబ్లీ అభిప్రాయం చెప్పినా, చెప్పకపోయినా బిల్లు మాత్రం పెట్టడం ఖాయమని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో బిల్లుపై చర్చించి, ముందుగా సమయం కోరితే మరో వారం రోజులు పొడిగించే అవకాశం ఉందని, అప్పటికప్పుడు సమయం కావాలంటే మాత్రం ఇచ్చే అవకాశాలు లేవంటున్నారు.
23వ తేదీలోగా అసెంబ్లీలో బిల్లుపై అభిప్రాయం తీసుకొని, 26వ తేదీలోగా క్రోడీకరించి దానిని రాష్ట్రపతికి పంపించాల్సి ఉంది. బిల్లు పైన అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే తీసుకుంటారని చెబుతున్నారు. కాగా, అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన రచ్చ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇరు ప్రాంత నేతల వ్యూహ, ప్రతివ్యూహాలు
బిల్లు నేపథ్యంలో ఇరు ప్రాంతాల నేతలు వ్యూహ, ప్రతివ్యూహాలు రచించుకుంటున్నారు. మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి నివాసంలో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉండవల్లి అరుణ్ కుమార్, వట్టి వసంత్ కుమార్, గాదె వెంకట రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. బిల్లులో సవరణలు ఉంటాయని సభాపతి చెప్పారని, కొన్ని పార్టీలు చర్చ జరగకుండా చేస్తున్నాయని, చర్చకు అందరూ సహకరించాలని, సవరణలు ప్రతిపాదించే అధికారం అసెంబ్లీకి ఉందన్నారు. విభజన.. సమైక్యం.. దేనిపైన అయినా చర్చ మాత్రం జరగాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అభిప్రాయాలు చెప్పకుంటే విభజనకు అంగీకరించినట్లవుతుందని, సవరణకు విలువ ఉంటుందా లేదా అనేది పార్లమెంటు చూసుకుంటుందని, అభిప్రాయాలు చెప్పడం మన బాధ్యత అన్నారు.
మరోవైపు తెలంగాణ ప్రాంత నేతలు మంత్రి జానా రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు, ఈటెల రాజేందర్, కె కేశవ రావు, కెటి రామారావు, నాగం జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బిల్లు అభ్యంతరాల పైన చర్చించారు. బిల్లుపై పార్టీలకతీతంగా ఒకే నివేదిక ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయించారు. బిల్లు పాసయ్యాక సవరణలు కోరాలని, ఓటింగ్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. బిల్లుపై చర్చకు సహకరించాలని నిర్ణయించారు.
కాగా, ఆర్టికల్ 3 ప్రకారం బిల్లుపై ఓటింగ్ అవసరం లేదని, శ్రీధర్ బాబు శాఖ మార్పుతో సమస్యలు తలెత్తితే సుదర్శన్ రెడ్డి సలహాలు తీసుకుంటామని, కిరణ్ శాఖను మార్చి మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఓటింగ్ అవసరం లేదని, ఓటింగ్ అంటే మాత్రం అడ్డుకోవాలని బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి సూచించారు.