శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లు: జైపాల్ రెడ్డి
న్యూఢిల్లీ/ హైదరాబాద్: పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రతిపాదించే అవకాశం ఉందని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి చెప్పారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ నోట్ను ఆమోదించిన తర్వాత ఆయన గురువారంనాడు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లును మంత్రి వర్గం ఆమోదించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇది తెలంగాణ ప్రజల విజయమని ఆయన అన్నారు.
తెలంగాణ నోట్ను సీమాంధ్ర కేంద్ర మంత్రులు వ్యతిరేకించిన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. విభజన విషయంలో నదీ జలాలు, విద్యుత్తు, గ్యాస్ తదితర అంశాలపై కేంద్ర మంత్రుల బృందం పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. విభజన వల్ల సీమాంధ్ర ప్రజలకు ఏ విధమైన అన్యాయం జరగదని ఆయన హామీ ఇచ్చారు. విభజనకు సీమాంధ్రులు సహకరించాలని ఆయన కోరారు.
హైదరాబాద్ తెలంగాణ మధ్యలో ఉందని, కాబట్టి హైదరాబాదును తెలంగాణ నుంచి విడదీయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన దాదాపు నలబై నిమిషాల పాటు మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు అవసరం గురించి ఆయన కూలంకషంగా వివరించారు. ప్రజాభీష్టం మేరకే తెలంగాణ ఏర్పడుతోందని జైపాల్ రెడ్డి మీడియాతో అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఎవరి అపజయం కాదని ఆయన అన్నారు. హైదరాబాదులోని ఏ ప్రాంతం ప్రజలు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
యాభై ఏళ్లు బాధపడ్డాం..
తాను జైలులో ఉన్న 16 నెలలు ఇంతగా ఏ రోజూ బాధపడలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అనడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కె. కేశవరావు తీవ్రంగా ప్రతిస్పందించారు. గత యాభై ఏళ్లలో మొదటి సారి తాము సంతోషపడుతున్నామని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఇక ఆగదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనతో తెలుగు జాతి రెండు విడిపోతుందనే వాదనలో నిజం లేదని ఆయన అన్నారు.
విభజనతో రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. ఇన్నాళ్లు తాము ఎన్నో మాటలు భరించామని, ఎన్నో మాటలను సహించామని ఆయన చెప్పారు. సిడబ్ల్యుసి నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని, ఇదే పద్ధతిలో తెలంగాణ ప్రక్రియను ముందుకు తీసుకుని పోవాలని ఆయన అన్నారు.
త్యాగాలతో కూడిన పోరాటం
తెలంగాణ ఉద్యమం త్యాగాలతో కూడుకున్నదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణ నోట్ను కేంద్రం ఆమోదించడం ప్రజా విజయమని ఆయన మీడియాతో అన్నారు. తెలంగాణ నోట్ను ఆమోదించినందుకుక ఆయన సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ బిల్లు పార్లమెంటు సభల్లో ఆమోదం పొందే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలంగాణ ప్రజలకు సూచించారు.