దొరికిందే బెల్లం, సంసారం ఇక్కడ..: బాబుపై నాయిని
హైదరాబాద్/ఢిల్లీ: కార్మిక శాఖలో నిధుల గోల్మాల్ వ్యవహారం పైన తెలంగాణ రాష్ట్ర హోంశాఖమంత్రి నాయిని నర్సింహా రెడ్డి శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రా ప్రిన్సిపల్ సెక్రటరీ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. లేబర్ కమిషన్ డబ్బులు ఎలా దారి మళ్లంచారని ప్రశ్నించారు.
దొరికిందే బెల్లం అన్నట్లుగా ఆంధ్రా పాలకులు దోపిడీకీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ఆటలు ఇక పైన కొనసాగనివ్వమన్నారు. కార్మికుల డబ్బులు దోపిడీ చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు.
ఆంధ్రప్రదేశ్ పాలన అంతా హైదరాబాదులో నడుస్తోంటే విజయవాడలో బ్యాంకు అకౌంట్ ఎందుకని ప్రశ్నించారు. కార్మికుల నిధుల పైన ఆంధ్రా సర్కారు కుట్ర చేస్తోందన్నారు. తెలంగాణ వాటాకు రూ.610 కోట్లు రావాల్సి ఉందని నాయిని తెలిపారు. సంసారం ఇక్కడ సోకులు అక్కడా అని ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్న ఉద్యమకారుల పైన ఉన్న అన్ని కేసులు ఎత్తి వేస్తామన్నారు. ఇటీవల 483 కేసులు ఎత్తివేశామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 1033 కేసులను ఎత్తివేస్తామని చెప్పారు. ఉద్యమకారులందరి పైన కేసులు ఎత్తివేయడం ఖాయమన్నారు.
గవర్నర్కు ఫిర్యాదు
నిధుల గోల్మాల్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేయనుంది. సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీసు కమిషనర్లు గవర్నర్తో భేటీ కానున్నారు. తెలంగాణ కార్మిక శాఖ నిధుల గోల్మాల్ ఆయన దృష్టికి తీసుకు వెళ్తారు.
బాబు ఇంటి ముందు ధర్నా చేయాలి: కేటిఆర్
విద్యుత్ విషయంలో తెలంగాణ తెలుగుదేశం నేతలు కేంద్రమంత్రులను కలువకుండా తమ అధినేత చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేస్తే బాగుండేదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆయన కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రవిచంద్రప్రసాద్లను కలిసి విజ్ఞప్తి చేశారు. మంత్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. తెలుగుదేశం నేతలు చిల్లరి వేషాలు మానుకోవాలని హితవు పలికారు.ఇదిలా ఉండగా వౌలిక వసతుల రంగంలో రాష్ట్రం తరపును ఆయన ఇండియాటుడే అవార్డును అందుకున్నారు.












Click it and Unblock the Notifications