టిటిడిలో తెలంగాణకు వెయ్యి కోట్ల వాటా: లా ఆఫీసర్తో ఈవో భేటీ, దీని వెనుక...?
చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానంకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈవో టిటిడి లా ఆఫీసర్తో మంగళవారం నాడు భేటీ అయ్యారు. తిరుమల ఆదాయం విషయమై తెలంగాణ నుంచి సౌందరరాజన్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టులో విచారణ సాగుతోంది. హైకోర్టులో విచారణ, నోటీసుల నేపథ్యంలో లా ఆఫీసర్తో ఈవో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణకు రూ.వెయ్యి కోట్ల బాకీని చెల్లించాలని సౌందరరాజన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
1987 నుంచి టిటిడి తెలంగాణకు రూ.దాదాపు వెయ్యి కోట్లు చెల్లించవలసి ఉందని, కానీ ఇప్పుటి వరకు రూ.56 లక్షలు మాత్రమే చెల్లించిందని సౌందర రాన్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇంకా వెయ్యి కోట్లరూపాయలు బాకీ ఉన్నందున చెల్లించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. 2002 నుంచి 2013 మధ్య వరకు టిటిడి ఆదాయంలో తెలంగాణకు రావాల్సింది రాలేదని పేర్కొన్నారు. దీంతో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో పాటు టిటిడికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
కాగా, ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు టిటిడి పలు ప్రాంతాల్లో ఆలయాలతో పాటు కళ్యాణ్ మండపాలు నిర్మించింది. ధార్మిక కార్యక్రమాలకు కూడా నిధులు వెచ్చించింది. అయితే రెండు రాష్ట్రాలుగా విడిపోయిన అనంతరం తిరుపతి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న టిటిడి.. తిరుమలపై ఉన్న వెంకటేశ్వరుడి ఆలయం ఏపీ పరిధిలోకి వెళ్లాయి.
అలాగే, అప్పటిదాకా టిటిడి పర్యవేక్షణ కింద రెండు రాష్ట్రాల్లోని ఆలయాలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం కిందకే వెళ్లిపోయాయి. ఉమ్మడి ఏపీలో టిటిడి హిమయత్ నగర్లో ఆలయం, కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేసింది. విభజన అనంతరం టిటిడి పాలక వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించింది.
పాలక మండలిలో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులకు కూడా చోటు కల్పించింది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి సండ్ర వెంకట వీరయ్యతో పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు చోటు దక్కింది. సాయన్న ఆ తర్వాత తెరాసలో చేరి, పాలక మండలి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో నిజామాబాద్కు చెందిన అరికెల నర్సారెడ్డికి అవకాశమిచ్చారు. వీటిని కూడా ప్రస్తావించిన సౌందర రాజన్ టిటిడికి వచ్చే ఆదాయంలో వాటా ఉందని చెబుతున్నారని అంటున్నారు.