తెలంగాణా ఎఫెక్ట్: ఏపీలో త్వరలో మరో సంక్షోభం; జగన్ కు తలనొప్పిగా కెసీఆర్ తీరు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రమాదం ముంచుకొస్తోంది. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వైఖరితో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో సంక్షోభం ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రమాదాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా, లేఖలు రాసినా ఫలితం లేకపోయింది. ఇంతకీ తెలంగాణ రాష్ట్రంలో ముంచుకొస్తున్న సంక్షోభం ఏంటి? ఏపీ ప్రభుత్వం ముందున్న కర్తవ్యం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి
తెలంగాణా విద్యుత్ ఉత్పత్తితో ఏపీకి పెద్ద తలనొప్పి
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సంక్షోభంతో విలవిలలాడుతోంది. విద్యుత్ సంక్షోభం కారణంగా విధించిన విద్యుత్ కోతలతో ప్రజలు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీ ప్రజలకు త్వరలో తాగునీరు, సాగునీరు ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి అన్నది తాజా పరిణామాలతో అర్థమౌతుంది. తెలంగాణ రాష్ట్రంతో కృష్ణా నదీ జలాల వివాదాన్ని కొనసాగిస్తున్న ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సర్కారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మాటను లెక్కచేయకుండా చేస్తున్న విద్యుత్ ఉత్పత్తి పెద్ద తలనొప్పిగా తయారైంది.
జలవిద్యుత్ ఉత్పత్తి.. నీటిని వృధాగా సముద్రం పాలు చేస్తున్న తెలంగాణా సర్కార్
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా వస్తున్న నీటిని దిగువకు విడుదల చేస్తుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం రోజుకు మూడు వేల నుంచి 7 వేల క్యూసెక్కుల వరకు నీటిని వినియోగిస్తుంది.
ప్రస్తుతం ప్రాజెక్టులో 194 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 131. 66 టిఎంసిలకు చేరితే డెడ్ స్టోరేజి గా పరిగణిస్తారు. అంటే ప్రస్తుతం ఉన్న నీటి మొత్తాన్ని బట్టి రెండు రాష్ట్రాలకు వేసవికి తాగు, సాగునీరు, విద్యుదుత్పత్తి అవసరాలకు కేవలం 62.34 టిఎంసిల నీరు మాత్రమే అందుబాటులో ఉంది.
కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ.. తెలంగాణా విద్యుత్ ఉత్పత్తిపై ఫిర్యాదు
ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణానది యాజమాన్య బోర్డు కు తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు చేసింది.
గతేడాది వర్షాకాలం ప్రారంభం కాకముందే తెలంగాణ రాష్ట్రం నాగార్జున సాగర్ నుంచి నీటిని తరచూ విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించిందని,దీనివల్ల పులిచింతల ప్రాజెక్టు లోస్పిల్ వే రేడియల్ గేట్లను తెరవడం, మూయడం చేయాల్సి వచ్చిందని ఏపీ రాసిన లేఖలో పేర్కొంది. ఇకఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల ఇబ్బంది తలెత్తుతుందని వెల్లడించింది.
ఫిర్యాదు చేసినా మారని తెలంగాణా సర్కార్ తీరు
విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ రాష్ట్రం నీటిని విడుదల చేస్తూ పోతేఈ నీరు వృధాగా సముద్రంలోకి పోతుందని పేర్కొన్న ఏపీ,ఇక వేసవిలో తాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలూ నాగార్జునసాగర్ పైన ఆధారపడి ఉన్నాయని, విద్యుత్ ఉత్పత్తి కోసం విలువైన నీటిని వృధా చేస్తే వేసవిలో తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని లేఖలో పేర్కొన్నారు. దీనిని కృష్ణా రివర్ మ్యానేజ్మెంట్ బోర్డ్ పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.
అయినప్పటికీ ఇప్పటికే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణ రాష్ట్రం విషయంలో చర్యలు తీసుకోలేదు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వద్దని చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం అవేమీ లెక్క చేయకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ పోతుంది.
నీటి సంక్షోభం దిశగా ఏపీ.. జగన్ సర్కార్ ముందు కీలక సమస్య
ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం మే నెలలో తాగునీటికి, సాగునీటికి తీవ్ర సంక్షోభం ఎదురవుతుంది. దీంతో నీటి ఎద్దడి తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేయడం, కేంద్ర జల శక్తి శాఖ దృష్టికి తీసుకు వెళ్లడం తప్ప మరేమీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో భవిష్యత్తులో రానున్న నీటి ఎద్దడిని సీఎం జగన్ ఏవిధంగా పరిష్కరిస్తారు అన్నది ఆలోచించాల్సిన విషయమే.