టి ఎఫెక్ట్: రాలేమని మినిస్టర్స్, కిరణ్ రచ్చబండ వాయిదా
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ సెగ తగిలింది! బుధవారం మెదక్ జిల్లాలో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ఇంకా నిర్ణయించలేదు. మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గీతా రెడ్డిలు కిరణ్ కుమార్ రెడ్డిని మంగళవారం మధ్యాహ్నం కలిశారు.
రేపు తమకు కృతజ్ఞతా సమావేశం ఉన్నందున రచ్చబండ కార్యక్రమానికి రాలేమని కిరణ్తో చెప్పారు. వాయిదా వేయాలని కోరారు. దానికి ముఖ్యమంత్రి అంగీకరించారు.
కిరణ్తో భేటీ అనంతరం సునీతా, గీతా రెడ్డిలు మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చినందున తాము సమావేశాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రేపు సభలో పాల్గొనాల్సి ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పి రచ్చబండను వాయిదా వేయాలని కోరామని, అందుకు ఆయన అంగీకరించారని తెలిపారు.
కాగా, ముఖ్యమంత్రి రేపు మెదక్ జిల్లా సదాశివపేటలో రచ్చబండను తలపెట్టారు. వాయిదా పడిన దీనిని ఎప్పుడు నిర్వహించేది తర్వాత నిర్ణయిస్తారు. ఈ నెల 16, 17 తేదీల్లో సీమాంధ్రలో రచ్చబండ కార్యక్రమం ఉంది.