అమరావతి ఎయిర్ పోర్ట్ రాకతో గన్నవరం క్లోజ్ ? సర్కార్ క్లారిటీ..!
ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వం కొత్త ఎయిర్ పోర్టు (Amaravati Airport) నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఐదు వేల ఎకరాల్లో ఈ ఎయిర్ పోర్టు నిర్మిస్తామని చెబుతోంది. ఇందుకోసం రెండో దశలో భూసమీకరణ కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాంతంల సేవలందిస్తున్న గన్నవరం ఎయిర్ పోర్టు (Gannavaram Airport) ను మూసేయడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. అమరావతి ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చాక గన్నవరం ఎయిర్ పోర్ట్ పరిస్ధితి ఏంటో తేల్చేసింది.
విజయవాడ విమానాశ్రయం మూసివేత వార్తలు పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి రూ.611.80 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, దీనిని త్వరలోనే ప్రారంభించేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియ, రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నాయని వెల్లడించింది. మరోవైపు అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రాజెక్ట్ అని, రాజధాని అమరావతి పరిధిలోని గుంటూరు జిల్లా, తాడికొండ మండలం రావెల గ్రామ సమీపంలో సుమారు 4,618 ఎకరాల్లో కొత్త గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సిద్ధమైనట్లు తెలిపింది.

అయితే ఇది భవిష్యత్తులో అమరావతిని గ్లోబల్ ఏవియేషన్ హబ్గా, విమానాల మరమ్మతుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన దీర్ఘకాలిక ప్రాజెక్ట్ అని ప్రభుత్వం తెలిపింది. మెట్రో నగరాలు, అభివృద్ధి చెందుతున్న రాజధాని ప్రాంతాలలో ఒకటి కంటే ఎక్కువ విమానాశ్రయాలు ఉండటం సాధారణమని పేర్కొంది. ఉదాహరణకు దిల్లీలో ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్, నోయిడా/జెవార్ ఎయిర్పోర్ట్, ముంబైలో ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్, నవీ ముంబై ఎయిర్పోర్ట్ ఉన్నాయని తెలిపింది. అదే విధంగా అమరావతిలో కొత్త ఎయిర్పోర్ట్ వచ్చినా, విజయవాడ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యథావిధిగా తన సేవలను కొనసాగిస్తుందని తెలిపింది. ఈ అంశంలో తప్పుడు ప్రచారం నమ్మొద్దని ప్రభుత్వం కోరింది.












Click it and Unblock the Notifications