ఏపీలో తెలంగాణ ప్రభావం - కలిసొచ్చేదెవరికి, కొత్త సమీకరణాలు..!!
ఏపీలో తెలంగాణ ఎన్నికల ప్రభావం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా - నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. అక్కడ ఉత్కంఠ భరితంగా ఎన్నికలు సాగుతుండటంతో ఏపీ ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు పార్టీల్లో ఎవరు గెలిస్తే ఎవరికి కలిసి వస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. ఏపీలోనూ ఎన్నికలు హోరా హోరీగా కనిపిస్తున్న ఈ సమయంలో పొత్తుల అంశం పైన తెలంగాణ ఫలితాలతోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
హోరా హోరీ పోరు : తెలంగాణ ఎన్నికలు నెక్ నెక్ టు ఫైట్ గా మారుతున్నాయి. కర్నాటక ఎన్నికల ఫలితాల నేపధ్యంలో కాంగ్రెస్పై అంచనాలు పెరిగాయి. ఇదే సమయంలో బీఆర్ ఎస్ శక్తిని కూడా తక్కువ అంచనా వేయలేమని పలువురు చెపుతున్నారు. గతంలో ముక్కోణపు పోటీ ఉంటుందని భావించినప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ కొంత వెనుకబడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా? నేనా? అనే రీతిలో పోరుసాగుతోంది.

ఏ మాత్రం పోల్ మేనేజ్మెంట్లో తేడా వచ్చిన ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏపీలోనూ తెలంగాణ ఎన్నికలపై ఆసక్తి కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీలో ఓటర్ల పైన మానసికంగా తమకు అనుకూలంగా ఆలోచన మారే అవకాశం ఉందని ప్రతిపక్షాలు అంచనాగా కనిపిస్తోంది.
ఏపీ పైనా ప్రభావం : తెలంగాణలో కేసీఆర్ పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ నే నమ్ముకుంటున్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మార్పులు..అమలు చేసిన సంక్షేమం తమను గెలిపిస్తాయని బీఆర్ఎస్ విశ్వసిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పూర్తిగా సంక్షేమ గ్యారెంటీ పధకాల పైనే ఆధారపడుతోంది. అవే తమకు ఓట్ల పంట పండిస్తామని నమ్ముతోంది.
దాదాపుగా ఏపీలోనూ ఇప్పుడు సంక్షేమే ప్రధాన అజెండాగా ఈ సారి ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది. సంక్షేమం అమలు..పాజిటివ్ ఓట్ బ్యాంక్ పైనే ఏపీలో జగన్ నమ్మకం పెట్టుకున్నారు. టీడీపీ సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించినా..ఆశించిన స్పందన కనిపించటం లేదు. తాజాగా టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించారు. ఏపీలో పొత్తుల అంశం కీలకంగా మారుతోంది.

ఫలితాలపై ఉత్కంఠ : తెలంగాణలో బీజేపీతో, ఏపీలో టీడీపీతో పవన్ పొత్తు కొనసాగిస్తున్నారు. బీజేపీ ఆశించినట్లుగ ఏపీ మూలాలు ఉన్న ఓటర్లు జనసేన-బీజేపీకి ఓట్లు వేయించటంలో పవన్ సక్సెస్ కాకుంటే తెలంగాణలో పొత్తులపైనా ప్రభావం ఖాయమనే విశ్లేషణలు ఉన్నాయి. అదే విధంగా బీఆర్ఎస్ గెలిచినా అదే తరహాలో పాజిటివ్ ఓటింగ్ నమ్ముకున్న వైసీపీకి కలిసొచ్చే అంశంగా ప్రచారం చేసుకొనే అవకాశం ఉంది.
కాంగ్రెస్ గెలిస్తే సంక్షేమ పథకాలే కారణంగా నిలుస్తాయని చెబుతున్న వేళ..వైసీపీ సైతం సంక్షేమమే మరితంగా ఎన్నికల్లో ప్రచారం చేసే ఛాన్స్ ఉంటుంది. టీడీపీ-జనసేన సంక్షేమంలో పోటీ పడినా..ఇప్పటికే వైసీపీ ఈ అంశంలో పై చేయి సాధించింది. అయితే, కాంగ్రెస్ గెలిస్తే మానసికంగా ఏపీలోని ప్రతిపక్షాలకు పరోక్షంగా కలిసొచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో, తెలంగాణ ఫలితంపైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications