భీమవరంలో తెలంగాణ మాజీ మంత్రి..! పందేల కోసమా..? పంతాల కోసమా..?
హైదరాబాద్ : తెలంగాణ-ఆంద్రప్రదేశ్ రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. తెలంగాణ ముందస్తు ఎన్నికల సందర్బంగా చెలరేగిన ఉద్వేగ పరిస్థితులు ఆరని చిచ్చులా రగులుతూనే ఉన్నాయి. ముందస్తు ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని పదే పదే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పేర్కొనడం, ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రశేఖర్ రావు మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబును దూషించడం వంటి పరిణామాలు ఉద్రిక్తతలకు తావిచ్చింది.
తెలుగు రాష్ట్రాల మద్య ఉద్వేగభరిత పరిస్థితులు..! ఇంతలోనే టీ నేతల ఏపీ పర్యటన..!!
రెండు రాష్ట్రాల మద్య చోటు చేసుకున్న వైషమ్య పరిస్థితులు మనోభావాలపై దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుని చంద్రబాబు ఓటమిని ఖాయం చేస్తామని చెప్పుకొస్తున్న తెలంగాణ నాయకులు ఇప్పుడు సంక్రాంతి సంబరాల పేరుతో ఏపీలో మకాం వేసారు. తెలంగాణ కు చెందిన ప్రముఖ మాజీ మంత్రి మీడియాలో ప్రకటనలు గుప్పించుకుని మరీ ఏపీలో పర్యటిస్తున్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మద్య తెలంగాణ మాజీ మంత్రి ఏపిలో పర్యటన పంతం కోసమా లేక కోడి పందేల కోసమా అనే అంశం పై ఉత్కంఠ నెలకొంది.
ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామన్న టీ నేతలు..! ఆసక్తి రేపుతున్న పర్యటనలు..!!
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే సంక్రాంతి పర్వదినం సందర్బంగా ఏపిలో పర్యటిస్తున్న తెలంగాణ మాజీ మంత్రి రాజకీయాలను ఏ మలుపుతిప్పుతారో అనే అంశం పై చర్చ జరుగుతోంది. ప్రతియేటా ఉభయగోదావరి జిల్లాలో ఫుల్ జోష్ లో కోడి పందాల ఆటలకు వెళ్లే ఆ నాయుకుడి పర్యటన ఈ సారి మాత్రం ఉత్సుకతను కలిగిస్తోంది. ఇంతకీ గోదావరి జిల్లాల్లో మకాం వేసిన ఆ తెలంగాణ మాజీ మంత్రి ఎవరు..? ఆయన పర్యటన వల్ల ఏపీ రాజకీయ పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి..?
భీమవరంలో మాజీ టీ మంత్రి తలసాని..! పందేలకా..? పంతానికా..?
మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ ఏపీ కి బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు చేరుకుంటారు. సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా ఇంద్రకీలాద్రి వరకు వెళతారు. కనక దుర్గను దర్శించుకుంటారు. అనంతరం విజయవాడ నుండి భీమవరం చేరుకుని అక్కడి ప్రసిద్ధ మావురాలమ్మ దేవాలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుని ఉభయగోదారి జిల్లాల ఆతిద్యాన్ని ఆస్వాదించనున్నారు తలసాని.
ఏపి ప్రజల మూడ్ తెలుసుకునే ప్రయత్నమా..? లేక గోదావరి రుచుల కోసమా..?
ఐతే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు జోక్యం చేసుకున్నారు కాబట్టి ఏపి రాజకీయాల్లో తాము కూడా జోక్యం చేసుకుంటామని మొదటినుండి చెప్పుకొప్తున్న గులాబీ పార్టీ నేతల ప్రకటనలు కొంత రాజకీయ ఉద్రిక్త పరిస్థితులకు తావిస్తోంది. ఇలాంటి తరుణంలో తెలంగాణ నేతల ఏపి పర్యటన పలు సందేహాలకు కలిగిస్తోంది. చంద్రబాబు పై పైచేయి సాధించేందుకు పంతంపట్టి ఏపిలో పర్యటిస్తూ ప్రజల మూడ్ ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా..? లేక ప్రతియేటా కోడి పందేలకు మరిగిన మనసుని అదుపులో పెట్టుకోలేక ఆంద్రా లో పర్యటిస్తున్నారా అనేది ఆసక్తిగా మారింది. మరి గుళ్లు, గోపురాల పేరుతో మజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేసే ఏపీ పర్యటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి..!