వేలకోట్ల ఆస్తి: చంద్రబాబుకు ఊరట, కేసీఆర్కు సుప్రీంలో షాక్
న్యూఢిల్లీ: ఏపీ స్టేట్ కౌన్సెల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్సీహెచ్ఈ) ఆస్తుల కేసులో సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఏపీఎస్సీహెచ్ఈ బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఇచ్చిన తీర్పుని రివ్యూ చేయాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సుప్రీం తిరస్కరించింది.
ఏపీ ఉన్నత విద్యా మండలి ఉనికిలో లేదని ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఏపీ ఉన్నత విద్యా మండలి, ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏపీ, ఏపీ ఉన్నత విద్యామండలిల అభ్యర్థనను అంగీకరిస్తూ ఏపీ ఉన్నత విద్యా మండలి ఖాతాల స్తంభనపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుని పక్కన పెడుతున్నామని మార్చి 18న సుప్రీం చెప్పింది.
ఏపీ ఉన్నతవిద్యామండలి ఖాతాలను స్తంభింపజేసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదని సుప్రీం స్పష్టం చేసింది. విభజనకు ముందు మండలి ఖాతాల్లోని నిధులను జనాభా నిష్పత్తి ప్రాతిపదికన అంటే 58:42 ప్రకారం ఆస్తులు, అప్పులను రెండు తెలుగు రాష్ట్రాలు పంచుకోవాలని చెప్పింది.
లేదంటేసెక్షన్ 47 నిరుపయోగం అవుతుందని పేర్కొంది. విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం ఖాతాలు తమకే చెందుతాయన్న తెలంగాణ ప్రభుత్వ వాదనతో కోర్టు విభేదించింది. ఆ తీర్పుపై ఏప్రిల్ 18న తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ బుధవారం జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతోకూడిన ఛాంబర్ బెంచ్ ముందుకు రాగా, తిరస్కరించింది.
గతంలో ఏపీఎస్సీహెచ్ఈ ఆస్తులలో ఏపీకి కేవలం రూ.25000 కోట్లు ఇవ్వవలసి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం లెక్కలు వేసుకుంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం రూ.70వేల కోట్లు లెక్కలు చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోర్టు గత తీర్పు వైపే మొగ్గు చూపింది.