ఏపీ, టీల మధ్య చిచ్చుపెట్టిన పట్టిసీమ ప్రాజెక్ట్: మాకూ వాటా ఉందంటున్న తెలంగాణ
అమరావతి: ఏపీ, తెలంగాణల మధ్య మరో కొత్త వివాదం తెరతీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నదీ జలాల అనుసంధానం పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో తెలంగాణ వాటా కోరనుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలిస్తున్న గోదావరి జలాల్లో తెలంగాణకు వాటా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ను గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఆదేశించినట్లు తెలిసింది. బచావత్ ట్రిబ్యనల్ తీర్పును ఉటంకిస్తూ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
దీని ప్రకారం కృష్ణా డెల్టా పరిరక్షణ కోసం పోలవరం కుడి కాల్వ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించే 80 టీఎంసీల నికర జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 45 టీఎంసీలు, కర్ణాటక, మహారాష్ట్రలు కలిపి 35 టీఎంసీల కృష్ణా నికర జలాలను అదనంగా వాడుకోవచ్చు.
ఈ మేరకు బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా డెల్టాకు చేసిన నికర జలాల కేటాయింపులో కోతపడుతుంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి పోలవరం కుడి కాల్వ ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజికి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బచావత్ ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొన్న పై విధంగా ఏపీకి 45 టీఎంసీలు దక్కుతున్నాయని, రెండు రాష్ట్రాలు విడిపోయినందున తెలంగాణకూ ఆ నీటిలో వాటా ఉందని బోర్డు పేర్కొంది. దీంతో గోదావరి బోర్డు ఆదేశాలపై వివరణ ఇచ్చేందుకు ఏపీ జలవనరుల శాఖ సమాయాత్తమవుతోంది.
ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొన్న విధంగా 'ఏపీ'లో తెలంగాణ కూడా ఉందన్న సూత్రం ప్రకారం శ్రీరాంసాగర్ నుంచి వచ్చే గోదావరి జలాల్లో, ప్రాణహిత, ఇంద్రావతి జలాల్లోనూ తమకు వాటా ఉంటుందని స్పష్టం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
పట్టిసీమ నీటిని ఏ నిష్పత్తిలో తెలంగాణకు పంచుతారో అదే నిష్పత్తిలో తెలంగాణ ప్రాజెక్టుల నీటిని తమకు పంచాలని కోరాలని ఏపీ జలవనరుల శాఖ భావిస్తున్నట్లు సమాచారం.