ఏపీలో చంద్రబాబు ఇంటికి వెళ్లిన తెలంగాణ గవర్నర్
Chandrababu Naidu: తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ మధ్యాహ్నం ఆయన విజయవాడను సందర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు. ఆయనతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఐటీ, మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. తమ ఇంటికి వచ్చిన గవర్నర్ను చంద్రబాబు, నారా లోకేష్ సాదరంగా ఆహ్వానించారు. ఆయనకు శాలువా కప్పారు. జ్ఞాపికను అందజేశారు. ఈ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదని, మర్యాదపూరకంగా ఏర్పాటైందని చెబుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్ లేరు. సీపీ రాధాకృష్ణన్.. ఇన్ఛార్జ్ మాత్రమే. జార్ఖండ్కు ఆయన పూర్తి స్థాయి గవర్నర్గా ఉంటోన్నారు. గతంలో గవర్నర్గా పని చేసిన తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేసి, బీజేపీ తరఫున క్రియాశీలక రాజకీయాల్లో దిగారు. మొన్నటి ఎన్నికల్లో చెన్నై సౌత్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
తమిళిసై సౌందరరాజన్ రాజీనామా తరువాత తెలంగాణ వంటి కీలక రాష్ట్రానికి పూర్తి స్థాయి గవర్నర్ లేకపోవడం సరికాదనే ఉద్దేశంలో ఉంది బీజేపీ. పైగా మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను గెలిచి పట్టు నిలుపుకొంది. దీన్ని మరింత బలోపేతం చేసేలా పావులు కదుపుతోంది. ఈ పరిస్థితుల్లో సీపీ రాధాకృష్ణన్.. స్వయంగా చంద్రబాబును కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తమిళనాడులోని కోయంబత్తూర్కు చెందిన రాధాకృష్ణన్ సుదీర్ఘకాలంగా భారతీయ జనతా పార్టీలో కొనసాగారు. తమిళనాడు మోదీగా ఆయనకు పేరుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, జన్ సంఘ్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1999 ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications