చంద్రబాబు అభ్యర్దనకు రేవంత్ ఓకే - రూ 2500 కోట్లు చెల్లింపు..!!
తెలంగాణ ప్రభుత్వం ఏపీకి బకాయిలు చెల్లించింది. పదేళ్ల కాలంగా పెండింగ్ లో ఉన్న నిధుల వ్యవహారానికి పరిష్కారం లభించింది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు - రేవంత్ చర్చల వేళ వచ్చిన ప్రతిపాదనల్లో భాగంగా ఈ చెల్లింపులు జరిగాయి. కేంద్రం సైతం ఏపీకి చెల్లించాల్సిన ఈ నిధుల గురించి తెలంగాణ ప్రభుత్వానికి సూచన చేసింది. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా రూ 2,500 కోట్లు ఏపికి చెల్లించింది.
బకాయిల చెల్లింపు
తెలంగాణ ప్రభుత్వం నుంచి సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న బకాయిలు ఏపీకి అందాయి. హైదరాబాద్ లోని ఇన్నర్ రింగ్ రోడ్డు, హుస్సేన్ సాగర్ ప్రాజెక్టుల కోసం ఉమ్మడి రాష్ట్రంలో విదేశీ రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలు చెల్లింపులు రాష్ట్ర విభజన సమయంలో 'ఆంధ్రప్రదేశ్' పేరుతో ఉన్న ఖాతాలు ఏపీకి రావడంతో సదరు రుణాలకు సంబంధించిన వడ్డీ, అసలును ఏపీ ప్రభుత్వమే కడుతోంది. ఏటా అందులో 42 శాతాన్ని తెలంగాణ సర్కారు ఏపీకి చెల్లించాలి. కానీ... పదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆ బకాయిలు చెల్లించలేదు.

కేంద్రం సూచనతో
తాజాగా హైదరాబాద్లో ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో సమావేశాలు జరిగాయి. ఢిల్లీ పెద్దలతో కూడా ఈ అంశాలపై చర్చించి ప్రతి వారం ఈ చర్యల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్డు, హుస్సేన్ సాగర్ ప్రాజెక్టుల కోసం ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఈఏపీ (విదేశీ ఆర్థిక సంస్థల సహాయంతో చేపట్టే ప్రాజెక్టులు) రుణాల అసలు, వడ్డీ మొత్తాన్ని ఏపీ సర్కారే చెల్లిస్తున్న అంశం తెరపైకి వచ్చింది.
ఏపీకి చెల్లింపులు
రెండు రాష్ట్రాల మధ్య బకాయిల చెల్లింపుల గురించి కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఏపీకి చెల్లించాల్సి ఉన్న రుణ వాటా గురించి తాజాగా తెలంగాణకు కేంద్రం సూచన చేసింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా అంగీకరించింది. రుణాల చెల్లింపులో 58 శాతం ఏపీ, 42 శాతం తెలంగాణ చెల్లించాలి. కానీ... పదేళ్లుగా తెలంగాణ నుంచి చెల్లింపులే జరగలేదు. ఇప్పుడు, ఇన్నేళ్లకు దీనికి సంబంధించిన రూ.2500 కోట్లు ఏపీకి దక్కాయి. కేంద్ర ఆర్థిక శాఖ సూచనతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను రాష్ట్రానికి జమ చేసింది.












Click it and Unblock the Notifications