తెలంగాణ జాగృతి ధర్నాపై రేవంత్, తారాచౌదరి కేసులో...
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట తెలంగాణ జాగృతి కార్యకర్తలు శుక్రవారం నిరసన తెలిపింది. బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలోని ఆయన ఇంటి వద్ద నిరసన తెలిపారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పైన చేసిన ఆరోపణలు అర్థరహితమని, వాటిని ఆయన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తు పైన వారిని విడుదల చేశారు.
మరోవైపు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే. తాను చేసిన ఆరోపణలు అబద్దమని నిరూపిస్తే ఏ విచారణకైనా సిద్ధమన్నారు. ప్రభత్వం కక్షకట్టినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. అవకతవకలను ప్రశ్నిస్తే తన పైన రకరకాల దాడులు చేయిస్తున్నారన్నారు. గంట క్రితం తన ఇంటి పైన తెరాస సభ్యులు దాడి చేశారని, ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.
ఇలా దాడులు చేస్తే తాను లొంగిపోతానని భావిస్తే పొరపాటు అన్నారు. అమ్మాయిలతో ఆరోపణలు చేయించడం ఏ సంస్కృతి అని ప్రశ్నించారు. శాసన సభలో ఏం జరుగుతోందో ప్రజలకు తెలియాలన్నారు. సభలో తమకు సీట్లు కేటాయించలేదని, తాము కూర్చున్నాక తమ వెనకాలే తెరాస సభ్యులు కూర్చొని అసభ్యమైన భాషలో తమను నిందిస్తున్నారన్నారు. వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సబబు కాదని, రాజకీయపరమైన ఆరోపణలు చేస్తే తాను సమాధానం చెబుతానన్నారు.
పోలవరంలో బండారం బయటపెట్టినందుకే తన పైన ఆరోపణలు చేశారన్నారు. తారాచౌదరి విషయంలో తనను ఇరికించే ప్రయత్నం చేశారన్నారు. తాను వాజపేయిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నట్లు చెప్పారు. ఏ పార్టీ నుండి ఎన్నికయ్యానో ఆ పార్టీలోనే ఉండాలనుకుంటున్నానని చెప్పారు. శాసన సభలో మాట్లాడితే తన పైన కేసులు పెడతారా అని ప్రశ్నించారు. బడ్జెట్ కేసీఆర్ కుటుంబ బడ్జెట్ అన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.
సీఎం తెలంగాణ సమాజం ముందు తనను దోషిగా నిలబెట్టేందుకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. దాడులు చేసి, అబద్దపు ఆరోపణలు చేసి తన నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే అది ఎవరి వల్లా సాధ్యం కాదన్నారు. తాను శిక్షణ పొందిన సంస్థ అలాంటి ధైర్యాన్ని ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. తనదైన పద్ధతిలో మరింత ఉత్సాహంగా పని చేస్తానని ఆయన చెప్పారు. కాగా, ఆయన జర్నలిస్టులకు వీడియో ఆధారాలు చూపించిన విషయం తెలిసిందే.