సిఎం సరి చేయాలి, అధిష్టానానికి చెప్తాం: టీ మంత్రులు
హైదరాబాద్: ఉద్యోగుల సమ్మెను పరిష్కరించి, ప్రజలకు సేవలందేలా చూడాలని తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు. ఈ మేరకు తాము ముఖ్యమంత్రిని కలుస్తామని, వినకపోతే కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో మాట్లాడాలని వారు నిర్ణయించుకున్నారు. తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం జానా రెడ్డి నివాసంలో సమావేశమై, పరిస్థితిని సమీక్షించి, భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నారు. సమావేశానంతరం జానా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యోగులు సమ్మె చేస్తున్న కాలంలో తాము చర్చలు జరిపి పరిష్కరించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేశామని, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అదే పని చేయాలని ఆయన అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రితో మాట్లాడుతామని చెప్పారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్రులకు అపోహలు, అనుమానాలు ఉండడం బాధాకరమని ఆయన అన్నారు. తెలుగు ప్రజల సామరస్యాన్ని, ఐక్యతను సోర భావానికి ఢోకా ఉండదని ఆయన అన్నారు. ప్రాంతాలుగా విడిపోవడానికి చారిత్రక కారణాలున్నాయని గ్రహించి విభజనకు సహకరించాలని ఆయన సీమాంధ్రులను కోరారు ఆందోళనలు ఇదే విధంగా కొనసాగితే విద్వేషాలు రగిలి ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఆ ప్రమాదం రాకముందే పరిస్థితిని అవగాహన చేసుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, తెలంగాణ బిల్లును పార్లమెంటులో సాధ్యమైనంత త్వరలో ప్రతిపాదించి, తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలని ఆయన అధిష్టానాన్ని కోరారు. తెలంగాణ ప్రజలకు పరిస్థితులను తెలియజేయడానికి, కాంగ్రెసు సాహసోపేత నిర్ణయంపై తెలంగాణ ప్రజలకు వివరించడానికి, ప్రజలకు అండగా ఉండడానికి ఈ నెల 18వ తేదీ నుంచి మొదలుకుని 9 జిల్లాల్లో జైత్ర యాత్ర పేరిట సభలు నిర్వహిస్తామని చెప్పారు.
కేంద్రానికి సమస్యలను వివరించి పరిష్కరించుకునేందుకు తాము సీమాంధ్రులకు సహకరిస్తామని, వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించే బదులు ఆందోళనలు కొనసాగించడం బాధాకరమని ఆయన అన్నారు. ఆందోళనలు హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె విరమించి,, ప్రజలకు సేవలందించే ధర్మాన్ని నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఉద్యోగులు తమ సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
మొదటి సభ ఈ నెల 18వ తేదీన నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో జరుగుతుందని, చివరగా నవంబర్ 25వ తేదీన నల్లగొండలో జరుగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణలోని 9 జిల్లాల్లో జైత్రయాత్ర ముగిసిన తర్వాత హైదరాబాదులో మహాసభ నిర్వహిస్తామని, ఈ సభ తేదీని తర్వాత ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులను అవమానించడాన్ని, ఆయన ఆస్తులపై దాడులు చేయడాన్ని బొత్స ఖండించారు. ప్రజలకు సేవలందించడానికి ముఖ్యమంత్రి పరిస్థితులను చక్కదిద్దాలని, ఈ విషయంలో తాము తమ ఓపికను పరీక్షించుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రితో మాట్లాడుతామని, అప్పటికి కూడా పరిస్థితి మారకపోతే అధిష్టానంతో మాట్లాడుతామని ఆయన అన్నారు. తమకు పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని, మార్పులను చేర్పులను అంగీకరించబోమని ఆయన అన్నారు