తెలంగాణ శాసనసభ సీట్లు 165కు కుదింపు, వచ్చే బడ్జెట్ నాటికి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభలో సీట్ల కేటాయింపు పైన విపక్షాలకు, అధికార పక్షానికి వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావుతో సభాపతి మధుసూదనా చారి సమావేశమయ్యారు. శాసన సభలో సీట్ల సంఖ్య కుదింపు పైన వారు చర్చించారు. సభలో 165 సీట్లు ఉండేలా కుదించాలని నిర్ణయించారు.
సభాపతి మధుసూదనా చారి ఆర్ అండ్ బీ అధఇకారులతో ఈ విషయమై సమాలోచనలు జరిపారు. పూర్తి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి సీట్ల కుదింపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కాగా, మంత్రి హరీష్ రావు మజ్లిస్ పార్టీ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్తో వేర్వేరుగా ఈ విషయమై సమావేశమై, చర్చించారు. అలాగే సభా సంఘం పైన కూడా హరీష్ రావు వారితో చర్చించారు.
బీజేపీ కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం
హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేడ్కర్ అందించిన గొప్ప వరం భారత రాజ్యంగం అన్నారు. బలమైన రాజ్యాంగం వల్లే దేశం ముందుకెళ్తోందన్నారు.
రాజ్యాంగం గొప్పతనం వల్లే విద్రోహుల యత్నాలు విఫలమవుతున్నాయన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక అమలు చేస్తే దళితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. బడ్జెట్లో నిధులను జనాభా ప్రాతిపదికన ఖర్చు చేయాలన్నారు. రాజ్యాంగం గొప్పతనం వల్లే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారన్నారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో ముందుకెళ్తామన్నారు.