ప్లీజ్! భోజనం చేయండి!!: టీ మంత్రుల వినతి, నో అన్న టిటీడిపి ఎమ్మెల్యేలు
హైదరాబాద్: స్పీకర్ చాంబర్లో ధర్నా చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను భోజనం చేయాల్సిందిగా పలువురు తెలంగాణ మంత్రులు కోరారు. మంత్రుల సూచనను ఎమ్మెల్యేలు తిరస్కరించారు. తాము ప్రతిపాదించిన మూడు డిమాండ్లను స్పీకర్ పరిష్కరించాలని కోరుతూ మంగళవారం తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ చాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణా రెడ్డి, ధర్మారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని, గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీలో జరిగిన పరిణామాల సీడీలను విడుదల చేయాలని, సీట్ల కేటాయింపులో మార్పులు చేయాలని టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ను డిమాండ్ చేశారు.
గొంతు నొక్కుతోందని విమర్స
సభలో ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సభలో లేనివాళ్లను ఎందుకు సస్పెండ్ చేశారని ఆయన ప్రశ్నించారు. సస్పెండైన టీడీపీ సభ్యులు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల హక్కులను హరీష్రావు బంధువుకు ఏ ప్రాతిపదికన ఇచ్చారని ప్రశ్నించారు. లైవ్ టెలీకాస్ట్ ఆర్డర్ కాపీని ఇవ్వాలని కోరితే స్పీకర్ ఎందుకు స్పందించడం లేదన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సండ్ర కోరారు.
బిజెపి వాకౌట్
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, నిరుద్యోగులకు ఉద్యోగాలు అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా నిరుద్యోగులపై స్పష్టమైన ప్రకటన రాలేదని విపక్షాలు ధ్వజమెత్తాయి. కమిటీలతో కాలయాపన చేయకుండా వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.
కాంట్రాక్టు ఉద్యోగల క్రమబద్దీకరణ ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్దీకరిస్తామని చెప్పలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పడంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఎన్నిసార్లు అడిగినా ఉద్యోగుల నియామకాలపై ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది.