టీ నోట్పై సీమాంధ్ర ఎమ్మెల్యేలు గుర్రు: ఏం చేద్దాం?
హైదరాబాద్: తెలంగాణ నోట్ మంత్రివర్గం ముందుకు వస్తుందనే వార్తలతో సీమాంధ్ర కాంగ్రెసు ప్రజాప్రతినిధుల్లో కలవరం ప్రారంభమైంది. పార్టీ అధిష్టానంపై వారు గుర్రుమంటున్నారు. అధిష్టానంపై వారు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఏ విధంగా అడ్డుకోవాలనే విషయంపై చర్చించడానికి సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులు గురువారం ఉదయం మంత్రి టిజి వెంకటేష్ నివాసంలో సమావేశమయ్యారు.
పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్తో పాటు మంత్రులు గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాపరెడ్డి, శాసనసభ్యులు సత్యానంద రావు, వంగా గీత, వీరశివారెడ్డి, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రక్రియను అడ్డుకోవడానికి ఏం చేయాలనే విషయంపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శానససభ్యులు చెబుతున్నారు. సమావేశానికి ముందే పార్టీ అధిష్టానంపై తీవ్రంగా మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై కూడా పలువురు మండిపడ్డారు. పరిస్థితి తీవ్రంగా ఉంటుందని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం వేస్తున్న అడుగులు కాంగ్రెసు పార్టీకి ఆత్మహత్యాసదృశ్యమని సత్యానంద రావు అన్నారు. రాష్ట్ర విభజనపై అధిష్టానం ముందుకు వెళ్లాలని అనుకోవడం దారణమని ఆయన అన్నారు. ఏం చేయాలనే విషయంపై ఉమ్మడి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తమకు రాజకీయ జీవితం ముఖ్యం కాదని, ప్రజల అభిప్రాయం ముఖ్యమని ఆయన అన్నారు.
శాసనసభలో తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన తర్వాత రాజీనామాలు చేస్తామని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అన్నారు. పార్టీ ఆఫ్ట్రాల్, ప్రజలు ముఖ్యమని ఎమ్మెల్యే కృష్ణమోహన్ అన్నారు. పార్టీ అధిష్టానం ఏకపక్షంగా ముందుకు వెళ్తోందని శేషారెడ్డి అన్నారు. పార్టీ అధిష్టానం వల్ల పార్టీకి తీవ్రమైన నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంపై చర్చిస్తామని శాసనసభ్యురాలు వంగా గీత చెప్పారు.
డొక్కా మాణిక్యవరప్రసాద్పై రాయలసీమకు చెందిన శాసనసభ్యుడు వీరశివారెడ్డి నిప్పులు చెరిగారు. సోనియా గాంధీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తొడకొట్టినప్పుడు మాట్లాడని మాణిక్యవరప్రసాద్ వైయస్ కుమారుడిగా జగన్ ఇష్టమని మాణిక్యవరప్రసాద్ అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీనుంచి వెళ్లిపోవడానికి నిర్ణయించుకుని మాణిక్యవరప్రసాద్ కిరణ్ కుమార్ రెడ్డిని తప్పు పడుతున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణ నోట్పై ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కుతుకుత ఉడికిపోతున్నారని ఆయన అన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రజల అభిప్రాయాలను, ఆగ్రహాన్ని గమనించకుండా నోట్ పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రక్రియపై ముందుకు వెళ్తే రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు అగ్నిగుండంగా మారుతాయని ఆయన అన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రుల తీరును ఆయన తప్పు పట్టారు. కావూరి సాంబశివ రావు సిడబ్ల్యుసికి రాజీనామా చేయకుండా తెలంగాణపై నిర్ణయాన్ని అడ్డుకోవాల్సిందని ఆయన అన్నారు.
పార్టీ పెట్టాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తాము కోరబోమని, పరిస్థఇతులు చక్కదిద్దాలని భావిస్తున్నామని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ఆర్డినెన్స్ను చించేయాలంటే చించేస్తారు, తెలంగాణపై నిర్ణయాన్ని మాత్రం వెనక్కి తీసుకోరని ఆయన అన్నారు.