వద్దన్నా యువకులతో చనువు?: కూతుర్ని చంపేసిన తల్లిదండ్రులు
ఇతరులతో చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు కన్న కూతుర్నే దారుణంగా హత్య చేశారు. తమ పరువుకు భంగం కలుగుతుందనే అనుమానంతో ఈ దారుణానికి తెగబడ్డారు.
నల్గొండ: ఇతరులతో చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు కన్న కూతుర్నే దారుణంగా హత్య చేశారు. తమ పరువుకు భంగం కలుగుతుందనే అనుమానంతో ఈ దారుణానికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసుల దర్యాప్తులో నిజం తేలడంతో ఆ హంతక తల్లిదండ్రులు కటకటాలపాలయ్యారు.
ఇతరులతో చనువుగా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలంలోని తీదేడు గ్రామానికి చెందిన పల్లేటి నర్సింహ, లింగమ్మ దంపతుల కుమార్తె పల్లెటి రాధిక(13) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. రాధిక చదువుతున్న సమయంలోనే ఇతరులతో కొంతకాలంగా చనువుగా వ్యవహరిస్తుండటంతో తల్లిదండ్రులకు విషయం తెలిసింది.
పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక..
రాధికను పద్దతి మార్చుకోవాలని, బుద్దిగా చదువుకోవాలని తల్లిదండ్రులు పలుమార్లు మందలించినా ఆమెలో మార్పు రాలేదు. కాగా, సెప్టెంబర్ 15న పాఠశాలకు వెళ్లిన రాధిక సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇతర వ్యక్తులతో మాట్లాడుతున్న విషయం తండ్రి నర్సింహకు తెలిసింది. ఇంటికి వచ్చిన రాధికను తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారు.
పరువు పోతోందంటూ..
ఇతరులతో తిరగడం మంచి పద్దతి కాదని, గ్రామంలో తమ పరువు పోతుందని హెచ్చరించారు. రాధిక తల్లిదండ్రుల మాటలు వినకుండా ‘నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను' అని చెప్పడంతో ఒక్కసారిగా క్షణికావేశంలో తండ్రి నర్సింహ రాధిక గొంతు నులిమి హత్యచేశాడు. రాధికను హత్య చేసిన విషయం బయటకు తెలిస్తే జైలు శిక్ష పడుతుందని భావించి, భార్య లింగమ్మ సాయంతో ఇంట్లో ఉన్న కిరోసిన్ మృతదేహం మీద పోసి నిప్పంటించారు.
ఆత్మహత్యగా చిత్రీకరణ
ఆ తర్వాత తమ కుమార్తె ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానస్పదంగా రాధిక మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. మృతదేహం సగభాగమే కాలిపోవడం, ఒకే చోట పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
తేల్చేసిన పోలీసులు..
ఈ క్రమంలో బాధితురాలి తల్లిదండ్రులను గట్టిగా విచారించడంతో అసలు విషయం బయటపడింది. నేరాన్ని అంగీకరించిన నర్సింహ, లింగమ్మను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మృతురాలు ఎవరితో చనువుగా లేదని, తండ్రి కేవలం అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.