నిజాం కాలంలో సర్వే: కేసీఆర్ అడుగులు, 600 కోట్లతో..
హైదరాబాద్: తెలంగాణలో భూములను సమగ్రంగా సర్వే చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ సర్వేకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో దానికి అయ్యే నిధుల కోసం 600 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలను రెవెన్యూశాఖ రూపొందిస్తోంది.
రికార్డులు సరిగ్గా లేకపోవడంతో అడ్డగోలుగా పట్టాదార్ పాస్ పుస్తకాలు తీసుకొని కొందరు దళారులు రైతు రుణాలు పొంది, అసలైన రైతులకు రుణాలు అందకుండా చేస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో రికార్డులు యంత్రాంగం వద్ద లేవు. 1936-42 మధ్యకాలంలో హైదరాబాద్ సంస్థానంలోని గ్రామాలన్నింట్లో సమగ్రంగా భూముల సర్వే జరిగింది. నాటి నిజాం హయాంలో ఈ సర్వేలు జరిగాయి.
ఇక 1972లో పట్టణాల్లో సమగ్రంగా భూసర్వే చేసి, టౌన్ సర్వే ల్యాండ్ రికార్డును తయారు చేశారు. గ్రామాల్లో ఏడు దశాబ్దాల కిందట సర్వే జరిగినప్పటికీ మళ్లీ భూముల సర్వేకు నోచుకోలేదు. దాంతో రికార్డులన్నీ పాతబడి పోయి, లెక్కలేనన్ని అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రభుత్వం భూ పంపిణీ చేసినప్పటికీ ఆ భూములపై ఇప్పటికీ క్షేత్రస్థాయిలో వివాదాలున్నాయి. 2008లో జాతీయ భూరికార్డుల ఆధునీకరణ పథకాన్ని కేంద్రం ప్రారంభించినప్పటికీ ఇది పూర్తిస్థాయిలో సాకారం జరగలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో భూముల సమగ్ర సర్వే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛాయ్పే చర్చాలో నరేంద్ర మోడీ కూడా భూముల సమగ్ర సర్వే తక్షణ కర్తవ్యమని ప్రకటించారు.