బానిస బతుకు: రేవంత్పై సుమన్ ఫైర్, కెసిఆర్పై అలీ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అనవసరంగా టిఆర్ఎస్పై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. ఆయన టిడిపి నేతల చెప్పు చేతల్లో పావుగా మారారని విమర్శించారు.
అభివృద్ధిని అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక డ్రామాలు ఆపకపోతే తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బానిస బతుకు వదిలేస్తే బాగుంటుందన్నారు. మెట్రోపై ఉద్దేశపూర్వకంగానే రేవంత్ రెడ్డి మాట్లాడారని అన్నారు. రేవంత్ రెడ్డి ఆంధ్రా నేతల వద్ద బ్లాక్ మెయిల్ రాజకీయాలు నేర్చుకున్నారని ఆరోపించారు.
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి రాయదుర్గం భూములకు ఏం సంబంధమని ప్రశ్నించారు. త్వరలోనే సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని సేకరించి వాస్తవాలు బట్టబయలు చేస్తామని తేల్చిచెప్పారు.బ్లాక్ మెయిల్ రాజకీయాలతో ప్రభుత్వ పెద్దలను, పారిశ్రామికవేత్తలను రేవంత్ రెడ్డి బెదిరించడం సరికాదని సుమన్ అన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్లో చేరతారో లేదో తనకు తెలియని చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా టచ్లో ఉన్నారని అన్నారు.
మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించాలి: షబ్బీర్
బతుకమ్మ పండగను ప్రభుత్వం నిర్వహించడం హర్షించదగ్గ విషయమని.. అయితే మంత్రివర్గంలో మాత్రం ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించకపోవడంతో సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వెంటనే తన మంత్రివర్గంలోకి కనీసం ఇద్దరు మహిళలను తీసుకోవాలని అన్నారు.
తమ ప్రభుత్వ మంత్రివర్గంలో మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ ఒక్కరితోనే రాలేదని షబ్బీర్ అలీ అన్నారు. పోలీసులతో అరెస్ట్ చేయించినందుకు ప్రజా సంఘాల నేత వరవరరావుకు కెసిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ సాధ్యం కాని హామీలిస్తున్నారని మండిపడ్డారు. హోంమంత్రి నాయిని నర్సింహారావు హుందాగా వ్యవహరించాలని సూచించారు.