త్వరలో అసెంబ్లీకి తీర్మానం: షిండే, వదిలేశా:పురంధేశ్వరి
హైదరాబాద్: తెలంగాణపై త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి తీర్మానాన్ని పంపిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం చెప్పారు. వీలైనంత త్వరగా తీర్మానాన్ని అసెంబ్లీకి పంపిస్తామని చెప్పారు. సీమాంధ్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని చెప్పారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. తెలంగాణపై వీలైనంత త్వరగా మంత్రుల బృందం నివేదిక ఇస్తుందని చెప్పారు. నెలవారీ నివేదికల్లో భాగంగా షిండే తెలంగాణపై స్పందించారు.
అధిష్టానానికి వదిలేశా: పురంధేశ్వరి
తాను సమైక్యాంధ్ర కోసం కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశానని దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను నిర్వర్తించానని, ఇక నిర్ణయమేమైనా అధిష్టానం విచక్షణకే వదిలేశానని తెలిపారు.
పార్టీని వీడం: మాణిక్య
రాష్ట్రం విడిపోవాలని తాను కోరుకోవడం లేదని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు. గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు కాంగ్రెసు పార్టీని వీడరని, సమైక్యవాదిగానే టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్షకు సంఘీభావం తెలిపారన్నారు. రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని రాయపాటి చెప్పారు.
బాబు దీక్షతో కదలిక: పయ్యావుల
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షతో కేంద్రంలో కదలిక వచ్చందని టిడిపి నేత పయ్యావుల కేశవ్ అన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యలు పరిష్కరించన తర్వాతే ముందుకెళ్లాలని కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీకి రెండుసార్లు తీర్మానం పంపుతున్నట్లు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కరించాలి: వెంకయ్య
సీమాంధ్ర ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించిన తర్వాత పార్లమెంటులో తెలంగాణ బిల్లును సామరస్యంగా ఆమోదించాలని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు.