మోత్కుపల్లికి టీటిడిపి నేతల బుజ్జగింపులు, ససేమిరా
హైదరాబాద్: రాజ్యసభ సీటు దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న తమ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులును బుజ్జగించేందుకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు చర్యలు చేపట్టారు. తెలుగుదేశం తెలంగాణ ఫోరం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో పలువురు నేతలను అధినేత చంద్రబాబు మోత్కుపల్లి నివాసానికి పంపించారు.
అయితే, మోత్కుపల్లి నర్సింహులు వారి మాట వినేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు చెంత ఉండటం కన్నా కట్టెలు కొట్టుకుని బతుకుతానని రాజ్యసభ టిక్కెట్ ఆశపడి భంగపడిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

మంగళవారం హైదరాబాద్లో మోత్కుపల్లిను సముదాయించేందుకు వచ్చిన ఆ పార్టీ సీనియర్ నేతల ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్.రమణ, నామా నాగేశ్వర రావు, మహేందర్రెడ్డి తదితరులు మోత్కుపల్లి నివాసానికి వచ్చినప్పుడు తన ఆవేదనను నర్సింహులు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీలో ఉండే కంటే కట్టెలు కొట్టి, వాటిని అమ్ముకుని బతుకుతానని మోత్కుపల్లి వాపోయారు. పార్టీని నమ్ముకుంటే ఇంత అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నించారు. సంవత్సరం నుంచి నీకే రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇపుడు నమ్మక ద్రోహం చేస్తారా అంటూ నిలదీశారు.
మరోవైపు నల్గొండ జిల్లా నేతలతో మోత్కుపల్లి మంతనాలు జరుపుతున్నారు. రాజ్యసభ సీటు వ్యవహారంలో చంద్రబాబు వ్యవహరించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications