రైతులకు టీ-టీడీపీ ప్రత్యేక నిధి, అవమానమని షబ్బీర్
హైదరాబాద్: తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ మంగళవారం చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేలా ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండు కోట్ల రూపాయలను టార్గెట్గా పెట్టుకున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలు రూ.5 లక్షలు, ఎంపీలు రూ.10 లక్షలు ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు రూ.60 లక్షలు వసూలయ్యాయన్నారు.
రేషన్ కార్డులు, పెన్షన్ల తొలగింపు పైన మా పోరాటం కొనసాగిస్తామని రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. పంటకు గిట్టుబాటు ధర, పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం తెలంగాణ టీడీపీ పోరాటం చేస్తుందన్నారు.
రైతు ఆత్మహత్యలకు కారణమైన కేసీఆర్ పైన కేసు నమోదు చేయాలని ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. తాను, రేవంత్ రెడ్డిలు రెచ్చగొట్టడం వల్లనే రైతులు చనిపోయారని చెప్పడం సిగ్గుచేటన్నారు. చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే బడ్జెట్ సమావేశాలు అడ్డుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి తెలంగాణకు న్యాయం చేస్తామన్నారు.
కేసీఆర్కు షబ్బీర్ అలీ లేఖ
కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ లేఖ రాశారు. ఆత్మహత్య చేసుకున్న అమరవీరులు 459 మందే అని చెప్పడం వారిని అవమానించడమే అన్నారు. నాడు ఉద్యమంలో రెండువేల మంది వరకు అమరులయ్యారని చెప్పిన కేసీఆర్, అధికారంలోకి వచ్చాక సంఖ్యను తగ్గిస్తున్నారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో కొంతమంది అమరుల కుటుంబాలు అందుబాటులో లేరంటూ సాయం తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలన్నింటికీ సాయం చేయాలన్నారు.
టీడీపీతో సమన్వయం చేసుకుంటాం: డీఎస్
సమావేశాల వరకు తాము టీడీపీతో సమన్వయం చేసుకుంటామని మండలి కాంగ్రెస్ నేత డీ శ్రీనివాస్ వేరుగా అన్నారు. ప్రభుత్వ వైఫల్యాల పైన మండలిలో నిలదీస్తామన్నారు. ఇందుకు ప్రతిపక్షాలన్ని కలిసి రావాలన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తెరాస బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రతిపక్షమే లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ, కాంగ్రెస్లే కారణం: పోచారం
రైతుల ఆత్మహత్యలకు, విద్యుత్ కొరతకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నిజామాబాదులో అన్నారు. శ్రీశైలం విద్యుత్లో తమకు వాటా ఉందని, ఆ వాటా తమ హక్కు అన్నారు. తెరాస చేపడుతున్న ప్రజా అనుకూల పనులు జీర్ణించుకోలేకే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయన్నారు.