పెళ్లిళ్లు: అమెరికా లేడీ టెక్కీతో తెలంగాణ టెక్కీ, టీ అనాథతో ఎపి యువకుడు
నల్లగొండ/ వరంగల్: అమెరికా అమ్మాయి, తెలంగాణ అబ్బాయి బుధవారం వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. నల్లగొండ జిల్లా రాజాపేట మండలం సోమారం సర్పంచ్ శీలం రమాదేవి, రాంచంద్రరెడ్డి దంపతుల పెద్ద కొడుకు శీలం భరత్రెడ్డి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి కాలిఫోర్నియాలో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడు. అక్కడే సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న రేచల్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
పెండ్లికి ఇరువైపులా తల్లిదండ్రులను ఒప్పించారు. బుధవారం హిందూ సంప్రదాయం ప్రకారం హైదరాబాద్ ఉప్పల్లోని బండి జంగయ్య గార్డెన్స్లో వివాహం చేశారు. అమ్మాయి తల్లిదండ్రులు ఫెరిబోస్, చెర్రివో, బంధువులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఇదిలావుంటే, మూడేండ్ల వయస్సు నుంచే ఐసీడీఎస్ సంరక్షణలో పెరిగిన అనాథ యువతికి బుధవారం వరంగల్లోని పద్మాక్షి దేవాలయంలో ఐసీడీఎస్ ఆర్జేడీ శైలజ ఆధ్వర్యంలో పెళ్లి జరిపించారు. 18 ఏండ్ల కిం దట వరంగల్ జిల్లా జనగామ రైల్వేస్టేషన్లో మూడేండ్ల వయస్సున ప్రీతిని పోలీసు లు చేరదీసి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.

ఐసీడీఎస్ అధికారులు జనగామలోని స్వధార్ హోంలో ప్రీతిని చేర్పించారు. ఐదోతరగతి వరకు అక్కడే చదివిన తర్వాత హన్మకొండలోని స్వధార్ హోంలో ఉంటూ పదోతరగతి పూర్తి చేసింది. ఇంటర్ చదవుతూ టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్కు నేర్చుకున్నది.
అనాథ యువతిని పెండ్లి చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన గోపి ముందుకొచ్చాడు. అధికారులే పెండ్లి పెద్దలుగా మారి బుధవారం ఉదయం 10.45 గంటలకు వరంగల్లోని పద్మాక్షి దేవాలయంలో వైభవంగా పెండ్లి జరిపించారు. తర్వాత మేడారం సమ్మక్క-సారలమ్మ దేవతల వద్దకు తీసుకెళ్లి మొక్కులు చెల్లించారు.
తల్లిదండ్రులు లేని లోటును తీర్చడమే కాకుండా నెలరోజులుగా సొంతకూతురి పెండ్లి కోసం కష్టపడినట్లుగా ఏర్పాట్లు చేసిన ఆర్జేడీ శైజలకు రుణపడి ఉంటానని వధువు ప్రీతి అన్నది. పెండ్లికి పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్భాస్కర్, పలు విభాగాల ఉన్నతాధికారులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications