కేసీఆర్ ఇంతదిగజారారా? అమ్మాయిని అడ్డుపెట్టి: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన టీడీపీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి శుక్రవారం దుమ్మెత్తి పోశారు. తన కూతురును అన్నారని బాధపడుతున్నానని కేసీఆర్.. ఓ ఆడకూతురిని అడ్డం పెట్టుకొని తన పైన దుష్ప్రచారం చేయించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆయన మాట్లాడారు. తాను ఎవరినీ కించపరచలేదని, అందుకు సంబంధించి ఆయన విలేకరుల సమావేశంలో వీడియోలు చూపించారు.
అనంతరం మాట్లాడారు. జర్నలిస్టులు వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్నారు. తాను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పైన ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. ఆమె పేరును కూడా తీసుకోలేదన్నారు. సభలో ఎలాంటి అన్ పార్లమెంటరీ పదాలు వాడలేదన్నారు. ఎవరి పట్లా అవమానకరంగా మాట్లాడలేదని చెప్పారు. నిజామాబాద్ కలెక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్న అడిగానని చెప్పారు.
సభలో తాను కవిత పేరు కూడా తీయలేదని, నిజామాబాద్ ఎంపీ గారు అని అడిగానని తెలిపారు. తాను అడిగేందుకు స్పీకర్ అనుమతించారని, మంత్రి కూడా సమాధానం ఇచ్చారని, ఆ తర్వాత చాలామంది మాట్లాడారని, మరుసటి రోజు కూడా చాలామంది మాట్లాడాక.. మళ్లీ నిన్నటి అంశం గురించి తీసి తమను సస్పెండ్ చేయడమేమిటని ప్రశ్నించారు. స్వయంగా కేసీఆర్ కూడా జోక్యం చేసుకొని, రేవంత్ తప్పు చేశారని, క్షమాపణ చెప్పాల్సిందేనని చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు.
సమగ్ర సర్వేలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుండి ఎన్నో కష్టాలకు ఓర్చి వచ్చారన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఒకరు ఖర్చులకు డబ్బులు లేక పుణే నుండి సైకిల్ తొక్కుకుంటూ వచ్చారన్నారు. తాను ఏదైనా ఆధారాలు చూపిస్తే ఆంధ్రా చానల్ అంటారని, కానీ, తాను తెలంగాణకు చెందిన వీ6 ఛానల్లో వచ్చిన దానిని చెబుతున్నానని తెలిపారు. తాను ఆరోపణలు చేయలేదని, ప్రశ్నోత్తరాల సమయంలో అడిగానని చెప్పారు.
అసెంబ్లీ రికార్టులో ఎవరైనా పరిశీలించుకోవచ్చునని చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీలో ఏమైనా కొత్త నిబంధన తీసుకు వచ్చారా చెప్పాలని ప్రశ్నించారు. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి.. మా సభ్యులను దూషిస్తున్నారని, మా కుటుంబాలను అవమానిస్తున్నారని, కచ్చితంగా క్షమాపణ చెప్పాలని, ఇందిరయే క్షమాపణ చెప్పారని వ్యాఖ్యానించారని, అనంతరం తమను సస్పెండ్ చేశారన్నారు. అది తాను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.
ఆధారాలు ఉంటేనే ప్రశ్నలు అడగాలా, తాను అవమానించినట్లు మాట్లాడినట్లు తేలితే క్షమాపణ చెప్పేందుకు, ఉపసంహరణకు సిద్ధమన్నారు. సమాధానం కోసం ప్రశ్న అడగవద్దా అన్నారు. ఉరిశిక్ష వసే వారికైనా చెప్పుకునేందుకు చివరి అవకాశం ఇస్తారన్నారు. ఆంధ్రా అసెంబ్లీలో కూడా తెలంగాణ వారిని ఇలా సస్పెండ్ చేయలేదన్నారు. తన వ్యాఖ్యల పైన ముఖ్యమంత్రికి అన్నీ తెలుసునన్నారు.
ఆయనకు అన్నీ తెలిసే, తమను మాట్లాడనివ్వకుండా ఉండేందుకు సస్పెండ్ చేశారన్నారు. తమ సస్పెన్షన్ పైన సమాధానం చెప్పాలన్నారు. స్పీకర్ కూడా ఇందుకు జవాబుదారి అన్నారు. స్పీకర్ దీనిని పునఃపరిశీలించాలన్నారు. తమ గొంతు నొక్కేందుకే సస్పెన్షన్ వేటు వేశారన్నారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారనడం సరికాదన్నారు. తాము ఎక్కడా సంయమనం కోల్పోలేదని చెప్పారు.
ఇక వ్యక్తిగత విషయానికి వస్తే అంటూ రేవంత్ మాట్లాడారు. కవిత గురించి కేవలం ప్రశ్న అడిగితేనే కేసీఆర్ ఇంత ఆవేదనకు గురయ్యారని, మరి ఓ ఆడకూతురిని పెట్టి తన పైన తెలంగాణ ద్రోహి అన్న విధంగా విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని అభిప్రాయపడ్డారు. మంత్రి ఈటెల సభలో పలుమార్లు మా సీఎం అంటే తామే దానిని సరిదిద్ది, మన సీఎం అని చెప్పామని, ప్రజలు గెలిపించినందున ఆయనను తాము కూడా సీఎంగా గౌరవిస్తున్నామన్నారు.
కానీ, సీఎంగా ఉండి కేసీఆర్ ఈస్థాయికి దిగజారుతారనుకోలేదన్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారనుకోలేదన్నారు. ఓ అమ్మాయిని పెట్టి తనను అవమానించడమేమిటని ప్రశ్నించారు. ఆమె కూడా ఓ తండ్రి బిడ్డనే కదా అని నిలదీశారు. తమ పైన ప్రత్యక్షంగా పోరాటం చేయలేకే ఇంతకు దిగజారుతారా అని ధ్వజమెత్తారు.
నమస్తే తెలంగాణకు చెందిన జిందగీలో సమాజం తలదించుకునేలా తన పైన దాడి చేయించడం సమంజసమా అని ప్రశ్నించారు. ఇంత నీచస్థాయికి దిగజారుతారా అన్నారు. కేసీఆర్ కూతురు విషయంలో తాను కేవలం నిజామాబాద్ ఎంపీగారు అన్నందుకే ఇంత ఆవేదన చెందితే, తన పైన ఆరోపణలు చేయించిన వారి తండ్రి ఎంత ఆవేదనకు గురి కావాలని ప్రశ్నించారు.