తెలంగాణా వర్సెస్ ఏపీ : శ్రీశైలం నుండి ఏపీ అక్రమ నీటి తరలింపు నిలువరించండి; కేఆర్ఎంబీకి లేఖాస్త్రం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ సర్కార్ కు కృష్ణా నది జలాల పంపిణీపై రోజుకో రకమైన మెలికలు పెడుతూ వరుస షాకులు ఇస్తుంటే, తాము ఏమాత్రం తగ్గలేదు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జగన్ కు దీటుగా షాక్ లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య అసలే సయోధ్య ధోరణి కనిపించటం లేదు. సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించే ఆలోచన ఇరు రాష్ట్రాలు చెయ్యటం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ధోరణి ఉంది.
కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ .. శ్రీశైలం వద్ద వరద జలాల మళ్లింపుపై ; ఆసక్తికర అంశం ఏంటంటే..
తెలుగు రాష్ట్రాల మధ్య సీరియల్ ఎపిసోడ్ లా జల వివాదం
ఏపీలో జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో రెండు తెలుగురాష్ట్రాల సీఎంలు దోస్త్ మేరా దోస్త్ అన్నారు. ప్రగతి భవన్ లో భేటీఅయ్యి తెలుగురాష్ట్రాల జలవివాదాలపై చర్చలు జరిపారు. అప్పుడు నదీజలాల వివాదం పరిష్కారం అవుతుందని అంతా భావిస్తే ఇప్పుడు అందుకు భిన్నంగా జలవివాదం సీరియల్ లా ఎపోసోడ్ ఎపిసోడ్ కు కాంట్రవర్సీలతో కొనసాగుతూనే ఉంది. కేంద్రం గెజిట్ ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాలకు ఝలక్ ఇచ్చినా సరే మారని ధోరణి తెలుగు రాష్ట్రాల మధ్య గ్యాప్ మరింత పెంచుతుంది.
తెలంగాణాకు జరిమానా విధించాలని ఏపీ లేఖ
తాజాగా శ్రీశైలం వద్ద నిబంధనలు బేఖాతరు చేస్తూ తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి చేసిందని ఆ విద్యుత్ వాటా లో 50 శాతం వాటా ఏపీకి రావాలని, నిబంధనలు బేఖాతరు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం, కృష్ణా బోర్డు పద్నాలుగవ సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులలో తెలంగాణ ప్రభుత్వం యధేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఆరోపించింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును, కృష్ణా బోర్డు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది.
ఏపీకి షాక్ ఇచ్చేలా కృష్ణా జలాల అక్రమ తరలింపును అడ్డుకోవాలని తెలంగాణా లేఖ
ఇక ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా తెలంగాణ సర్కార్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కు కృష్ణా జలాల అక్రమ తరలింపును అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల రెగ్యులేటర్, ఎస్కేప్ రెగ్యులేటర్, రెగ్యులేటర్ లింక్ ఛానల్ నుండి ఈనెల 20వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 85.67 టీఎంసీలకు పైగా కృష్ణా జలాలను తరలించారని తెలంగాణ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. అంతేకాదు కె ఆర్ఎంబి చైర్మన్ కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు రాసిన లేఖలో శ్రీశైలం డ్యాం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని తరలించకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా నీటి తరలింపును కూడా నిలువరించాలని లేఖలో పేర్కొన్నారు.
శ్రీశైలం నుండి ఏపీ నీటి తరలింపును నిలువరించాలని తెలంగాణా లేఖ
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి 76.39 టీఎంసీలు, హంద్రీనీవా సుజల స్రవంతికి 9.28 టీఎంసీల నీటిని తరలించారని గుర్తు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందే జలవిద్యుత్ కోసమని, జల విద్యుత్ విషయంలో అభ్యంతరం పెట్టడం ఏపీ ప్రభుత్వానికి తగదని లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలంలో 880 అడుగులకు పైగా నీరు నిల్వ ఉన్నప్పుడు ఈ నీటిని తరలించాలని, కానీ నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలింపు చేస్తోందని పేర్కొన్నారు. 34 టిఎంసిలకు ఇప్పటికే 85.67 టీఎంసీల మళ్లించారని పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా సుజల స్రవంతి నీటి తరలింపును తక్షణం అడ్డుకోవాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
వరద జలాల పేరుతో నీటి తరలింపు వాదన సరి కాదన్న తెలంగాణా
ఇదిలా ఉంటే వరద జలాలను మాత్రమే తరలిస్తున్నామని, వరద జలాలను శ్రీశైలం ప్రాజెక్టు వద్ద మళ్లింపు చేయకుంటే దిగువనున్న ప్రాంతాలలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని గతంలో ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. తాము మళ్లింపు చేసే వరద జలాలను నీటి లెక్కలలో చూడకూడదని కూడా ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. అయితే తెలంగాణ సర్కార్ మాత్రం ఏపీ ప్రభుత్వం వరద జలాల పేరుతో తరలింపు చేస్తున్న నీటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వరద జలాలను మాత్రమే తరలిస్తున్నామని ఏపీ వాదన సరికాదని, వాటిని కూడా నీటి లెక్కలలో లెక్కించాల్సిందేనంటూ తెలంగాణా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు రాసిన లేఖలో పేర్కొంది. అంతేకాకుండా ఈ నీటి సంవత్సరంలో వినియోగించుకోని నీటిని వచ్చే నీటి సంవత్సరానికి క్యారీ ఓవర్ చేయాలని కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి చేసింది.
Recommended Video
వరుస లేఖలతో నదీ వివాదాలు మరీ జటిలం
మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల విషయంలో ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు పోటీ పడి మరీ ఫిర్యాదులు చేసుకుంటున్న తీరు తెలుగు రాష్ట్రాల మధ్య అగాధాన్ని మరింత పెంచుతుంది. నదీజలాల విషయంలో ఒక రాష్ట్రం అనుసరిస్తున్న విధానం మరో రాష్ట్రానికి నచ్చడం లేదు. రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ ఒకరు చేస్తున్న అక్రమాలను ఇంకొకరు వేలెత్తి చూపిస్తూ రచ్చ చేస్తున్నారు. ఇక ఫిర్యాదులతో ఒకరిపై ఒకరు రాసుకుంటున్న లేఖలు సమస్యను పరిష్కరించకుండా మరింత జఠిలం చేస్తున్నాయి అన్న వాదన వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది.