బీజేపీలోకి బ్రహ్మానందం.! ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున: నాడు పవన్ కళ్యాణ్ అక్కడే..!
టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ కమెడియన్ కోట శ్రీనివాస రావు సైతం బీజేపీ ఎమ్మెల్యేగా పని చేసారు. ఇక, మరో కమెడియన్ బాబూ మోహన్ సైతం ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఇక, బ్రహ్మనందం కొద్ది రోజులుగా కర్నాటలో మరో మూడు మూడు రోజుల్లో జరిగే ఉప ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తున్నారు. కర్నాటలో తెలుగువారు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.
ప్రచారంలో భాగంగా ఆయన జోకులు వేస్తూ..పొలిటికల్ పంచ్ లతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆయన బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేయటం ద్వారా బ్రహ్మానందం కాషాయం పార్టీలో చేరినట్లేననే ప్రచారం మొదలైంది. అయితే, ఆయన మాత్రం తన స్నేహితుడికి మద్దతుగా ..ఆయన గెలుపు కోసం మాత్రమే పని చేస్తున్నానని చెబుతున్నారు. ఇప్పుడు బ్రహ్మానందం బీజేపీ అభ్యర్ధి గెలుపు కోసం పని చేస్తున్ని నియోజకవర్గంలోనే గతంలో పవన్ కళ్యాణ్ సైతం ఇక స్వతంత్ర అభ్యర్ధి కోసం ప్రచారం నిర్వహించారు.
బీజేపీలోకి బ్రహ్మి..పొలిటికల్ ఎంట్రీ..
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హస్యనటుడిగా గుర్తింపు ఉన్న బ్రహ్మనందం పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఆయన బీజేపీ అభ్యర్ధికి మద్దతుగా ప్రస్తుతం కర్నాటక ఎన్నికల ప్రచారం లో బిజీగా ఉన్నారు. ఈ నెల 5వ తేదీన కర్నాటక ఉప ఎన్నికల్లో పోలింగ్ జరగనుంది.
దీంతో..బ్రహ్మానందం పూర్తిగా చిక్కబళ్లాపుర నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. అక్కడి నుండి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్దిగా గెలిచి...తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న డాక్టర్ కే సుధాకర్ తరపున ప్రచారం చేస్తున్నారు. అయితే, పార్టీలో చేరిక గురించి క్లారిటీ ఇవ్వకుండా దాటేస్తున్న బ్రహ్మానందం..డాక్టర్ సుధాకర్ తనకు మిత్రుడని..ఆయన గెలుపు కోసం పని చేస్తున్నానని చెప్పుకొచ్చారు. బ్రహ్మనందం ప్రచార సమయంలో జోష్ కనిపిస్తోంది.
నాడు పవన్ కళ్యాణ్ సైతం అక్కడే..
చిక్కబళ్లాపుర నియోజకవర్గంలో తెలుగు వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధి గెలుపు కోసం బ్రహ్మనందం పని చేస్తున్నారు. 2018లో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన కెవి నవీన కిరణ్ తరపున సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసారు. ఆ ఎన్నికల్లో నవీన్ కుమార్ ప్రస్తుతం బరిలో ఉన్న సుధాకర్ తరువాతి స్థానంలో నిలిచారు.
ఆయనకు 18.58 శాతం ఓట్లు వచ్చాయి. ఇక, ఇప్పుడు అదే నియోజకవర్గం నుండి బ్రహ్మనందం ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మానందం మద్దతిస్తూ ప్రచారం చేస్తున్న అభ్యర్ధి డాక్టర్ కే సుధాకర్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్దిగా 82006 ఓట్లు సాధించి 51.76 శాతం ఓట్లతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా రాజీనామా..సుప్రీం తీర్పు..ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచారు.
సినీ నటుల ప్రభావం ఎక్కువే..
ఏపి సరిహద్దు నియోజకవర్గంగా ఉండే చిక్కబళ్లాపుర నియోకవర్గంలో పోటీలో నిలిచే అభ్యర్ధులకు..తెలుగు ప్రముఖులకు సంబంధాలు సాధారణంగా కనిపిస్తాయి. ఇప్పుడు బీజేపీ అభ్యర్ధికి మద్దతుగా పోటీ చేస్తున్న బ్రహ్మనందం త్వరలోనే బీజేపీలో అధికారికంగా చేరుతారనే ప్రచారం కొనసాగుతోంది. కర్నాటలోని చిక్కబళ్లాపుర, బాగేపల్లి, గౌరిబిదనూరు నియోజకవరాల్లో తెలుగు మాట్లాడేవారు ఎక్కువ. తెలుగు సినీ నటుల ప్రభావం కూడా ఈ ప్రాంతం లో ఎక్కువే.
అయితే, ఇప్పుడు బ్రహ్మనందం ప్రచారం చేస్తున్న నియోజకవర్గంలో స్పందన బాగానే కనిపిస్తున్నప్పటికీ..అవి ఓట్లుగా ఎంత వరకు మారుతాయ..బీజేపీ అభ్యర్ధి సుధాకర్ కు ఎంత వరకు కలిసివస్తుందనేది ఈ నెల 5న జరిగే పోలింగ్ తరువాత స్పష్టత రానుంది.