'రెడ్డి'గారి కోసం 'నాయుడు'గారి వ్యూహం
వచ్చే ఎన్నికల్లో విజయమే ఏకైక లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తట్టుకొని టీడీపీని అధికారంలోకి తీసుకురావడం అంత సులువేం కాదు. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఎన్నికల సమయంలో టీడీపీ-వైసీపీ మధ్య భీకర సంగ్రామం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబును కుప్పంలో ఓడించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జగన్ ను పులివెందులలో ఓడించాలని చంద్రబాబు.. ఇలా రకరకాల ప్రణాళికలు రూపొందించుకొని వాటిని అమలు చేసుకుంటూ వస్తున్నారు.
వ్యూహం మార్చిన చంద్రబాబు : కుప్పంలో తనను ఎప్పుడైతే టార్గెట్ చేశారో.. అప్పటి నుంచి చంద్రబాబు తన వ్యూహాన్ని మార్చారు. వైసీపీకి బలమైన నియోజకవర్గాలన్నింటిలో రోడ్ షోలు నిర్వహించడంతోపాటు పార్టీ కచ్చితంగా గెలిపించేలా వ్యూహరచన చేశారు. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే తనను టార్గెట్ చేశారని, కానీ రాయలసీమతో సహా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీని ఓడించాలనే పట్టుదలను చంద్రబాబు ప్రదర్శిస్తున్నారు. తన వ్యూహంలో భాగంగా వైసీపీ కంచుకోటల్లో చంద్రబాబు ఇదేం ఖర్మ, బాదుడే బాదుడు పేర్లతో వరుసగా రోడ్ షో చేసుకుంటూ వస్తున్నారు.

రెడ్డి సామాజికవర్గం నుంచి : గత ఎన్నికల్లో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలతో కూడిన రాయలసీమలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 52 సీట్లకు 49 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఉరవకొండ, కుప్పం, హిందూపురంలో మాత్రమే టీడీపీ నిలబడగలిగింది. రాయలసీమ నుంచి వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా యువతను, రెడ్డి సామాజికవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులను బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. రాయలసీమకు ప్రత్యేకంగా రోడ్ మ్యాప్ ఇవ్వనున్నట్లు మహానాడులో ప్రకటించారు.
రెడ్డి-బలిజ-బీసీ : రెడ్డి సామాజికవర్గంలో బలమైన నేతలుగా ఉన్నవారిని తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులుగా బరిలోకి దింపాలనుకుంటున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల్లో కూడా రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే ఉన్నారు. రెడ్లతోపాటు బలిజలు, బీసీలు సీమలో ఎక్కువగా ఉన్నారు. రెడ్డి-బలిజ-బీసీ కాంబినేషన్ లో టికెట్లను ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బీసీలెక్కువ. కడపలో రెడ్ల ప్రాబల్యం, అనంతపురంలో రెడ్లతోపాటు బీసీ సామాజికవర్గం ఎక్కువగా ఉండటం, చిత్తూరు జిల్లాలో రెడ్లతోపాటు కమ్మ, బలిజలు ఉన్నారు. ఈ లెక్కలన్నింటినీ పరిశీలించి చంద్రబాబు త్వరలోనే రెడ్డి సామాజికవర్గానికి చెందిన బలమైన అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications