''రూపాయి'' పై దృష్టి సారించిన తెలుగుదేశం పార్టీ
రోజురోజుకు రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. మిత్రులు ప్రత్యర్థులవుతున్నారు.. ప్రత్యర్థులు మిత్రులవుతున్నారు. ముఖ్యంగా రానున్న ఏపీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. పొత్తులు కుదిరే పక్షంలో పై మిత్రులపై చేయి సాధించాలన్నా, పెద్దన్నగా తమ మాట చెల్లుబాటు కావాలన్నా, ప్రజల్లో తెలుగుదేశం పార్టీ వేవ్ ప్రారంభమైంది.. ఎన్నికలు జరగడమే తరువాయి అన్న సంకేతాలను పంపించాలన్నా ప్రతిదానికీ రూపాయి అవసరమవుతోంది. రూపాయి లేకుండా ఏ పనీ జరగడంలేదు.

రెండు సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అప్పటివరకు పలు కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే అధినేత చంద్రబాబునాయుడు బాదుడే బాదుడు పేరుతో జిల్లాల పర్యటన జరుపుతున్నారు. మినీ మహానాడులు కూడా జరపాల్సి ఉంది. ఒక్క మహానాడుకే భారీగా ఖర్చయింది. రానున్న రోజుల్లో ఈ ఖర్చు మరింతగా పెరగబోతోంది. అప్పటివరకు పార్టీకి ఆర్థికంగా ఒక భరోసా కావాలంటే ఏం చేయాలనే విషయమై అధిష్టానం దృష్టిసారించింది.

ప్రకటనలే కానీ విరాళాలేవీ?
నేతలు ఆర్భాటంగా విరాళాలు ప్రకటిస్తారేకానీ పార్టీకి సాయం మాత్రం అందదని చంద్రబాబు స్వయంగా మహానాడులోనే చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి లేకుండా రాజకీయాలు చేయడం సాధ్యపడటంలేదు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు భారీగా డబ్బులు వెదజల్లడంపైనే దృష్టిసారించారు. ప్రతి రాజకీయ పార్టీలోను ఇదే పరిస్థితి. అంగబలం, ఆర్థిక బలం ఉన్న అభ్యర్థులే ఆయా పార్టీల తరఫున పోటీచేస్తున్నారు. ఈ రెండు బలాలు ఉన్నవారైతే ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థులను బలంగా ఢీకొడతారనే నమ్మకం అన్ని పార్టీల్లో వ్యక్తమవుతోంది. అటువంటివారి కోసమే అన్ని పార్టీలు వెదుకులాటలు ప్రారంభించాయి.

రూపాయి లేకుండా ఏదీ సాధ్యపడటంలేదు
నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయాలన్నా, జిల్లాల పర్యటన సమయంలో హంగు, ఆర్భాటం కనపడాలన్నా రూపాయి అవసరమవుతోంది. జిల్లాల్లో మినీ మహానాడులకు స్థానిక నేతలు కొందరు ఖర్చుపెడుతున్నా.. మరికొంత కేంద్ర కార్యాలయం సర్దుబాటు చేస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఇన్ఛార్జిలు పలువురు ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి అప్పుడే ఖర్చుచేయడం ఎందుకు? అనే ధోరణిలో ఉండటం పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నట్లు తెలుస్తోంది. అటువంటి నేతలను గుర్తించి ఇప్పటినుంచే ఎన్నికలకు సమాయత్తం చేయడంపై టీడీపీ అధిష్టానం దృష్టిసారించింది. రానున్న రోజుల్లో టీడీపీ మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోందని, పార్టీకి సహకరించకుండా దూరంగా ఉండేవారిని దూరం పెట్టాలని అధినేత నిర్ణయించుకున్నారని, కఠినంగా వ్యవహరించబోతున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications