టీడీపీ వ్యూహాత్మక మౌనం.. అందుకేనా?
రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరించిన అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళస్థలాలివ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందినవారికి నిడమర్రు, కృష్ణాయపాలెం, ఐనవోలు, కురగల్లు గ్రామాల పరిధిలో స్థలాలను కేటాయించనున్నారు. దీనిపై రైతుల అభ్యంతరాలను ఏపీ హైకోర్టు తోసిపుచ్చడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంలో వచ్చేవారం విచారణ జరగబోతోంది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై విమర్శలకు దిగే తెలుగుదేశం పార్టీ ఆర్-5 జోన్ అంశంపై మాత్రం పెదవి విప్పడంలేదు.
అన్నివర్గాల ప్రజలు నివసించాలి : రాజధాని నిర్మాణం కోసమంటేనే తాము స్వచ్ఛందంగా భూములిచ్చామని, పేదలకు ఇళ్ళస్థలాలకు కాదంటూ రైతులు తమ వాదన వినిపిస్తున్నారు. అయితే సీఆర్డీయే చట్టంలో కూడా రాజధానిలో అన్నివర్గాల ప్రజలు నివసించాలనే నిబంధన ఉందనే విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 20వేల మందికి పైగా ఈ ప్రాంతంలో నివాస స్థలాలను కేటాయిస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితమే ప్రభుత్వం పేదలకు ఇళ్లస్థలాలివ్వడానికి ప్రయత్నాలు చేయగా రైతుల అభ్యంతరాలతో న్యాయమపరమైన ఇబ్బందులు తలెత్తాయి.

టీడీపీ వ్యూహాత్మక మౌనం : ఆర్5 జోన్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ మౌనం వహిస్తోంది. ఇది తమకు సంబంధంలేని వ్యవహారమన్నట్లుగా టీడీపీ ఉంది. రాజధాని వికేంద్రీకరణ విషయంలో రైతులతోపాటు పాదం కలిపిన టీడీపీ ఆర్5 జోన్ విషయంలో వెనక్కి తగ్గింది. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మంత్రులు టీడీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడకుండా వివాదాలు సృష్టిస్తోందని వారంతా ఆరోపించారు. ఎన్టీఆర్, గుంటూరు.. రెండు జిల్లాలకు చెందిన 8 నియోజకవర్గాల ప్రజలకు ఇళ్లస్థలాలు కేటాయిస్తుండటంతో టీడీపీ వ్యూహాత్మకంగా మౌనం వహించింది.
వైసీపీ ప్రచారాన్ని నిజం చేసినట్లవుతుందని : ప్రజలకు లబ్ధి కలిగించే పథకాలను వ్యతిరేకిస్తే తమ పార్టీపై వ్యతిరేకత పెరుగుతుందనే అభిప్రాయంతో ఆ పార్టీ నేతలున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో ఉన్న లోపాలను ఎండగట్టడానికే పరిమితం కావాలని టీడీపీ భావిస్తోంది. ఇళ్ల స్థలాల కేటాయింపును వ్యతిరేకిస్తే, వైసీపీ చేసే విమర్శలు ఊతమిచ్చినట్టేనని ఆ పార్టీ నాయకులు యోచిస్తున్నారు. అమరావతి ప్రాంతం ఓ వర్గానికి సంబంధించిన ప్రాంతంగా వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కూడా అంగీకరించడం లేదని వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఇళ్ల స్థలాల కేటాయింపును వ్యతిరేకిస్తే వైసీపీ ప్రచారాన్ని నిజం చేసినట్లవుతుందనే ఉద్దేశంతో ఆ పార్టీ నేతలు సైలెంటయ్యారు.












Click it and Unblock the Notifications