వారి రాజకీయం.. 'నభూతో.. నభవిష్యతి'?
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పోరాడమని పార్టీ అధినేత చంద్రబాబు చెబుతుంటే తెలుగు తమ్ముళ్లు మాత్రం తమలోతామే పోరాడుకుంటున్నారు. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. ప్రత్యర్థిని ఓడించే బదులు వారిలో వారినే ఓడించేందుకు పావులు కదుపుతున్నారు. ప్రత్యర్థి పార్టీపై రాజకీయం చేయమంటే సొంత పార్టీలోని ప్రత్యర్థులపై రాజకీయం చేస్తున్నారు. వీటన్నింటినీ గమనిస్తున్న చంద్రబాబునాయుడు అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
అంతర్గత కుమ్ములాటలను కట్టడి చేయాలని..
వీరిలో వీరే వివాదాలు ఆపి పార్టీ కోసం పనిచేయకపోతే ఎన్నికల్లో టికెట్లు నిరాకరించబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఆయన రాష్ట్రంలో 160 నియోజకవర్గాల వరకు సమీక్షలు పూర్తిచేశారు. అందులో కొంతమంది ఇన్ ఛార్జిలకు సీటు ఖరారు చేయలేదు. వీరిలో గొడవలు పడుతున్న తెలుగు తమ్ముళ్లు కూడా ఉన్నారు. అంతర్గత కుమ్ములాటలను కట్టడి చేయకపోతే జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకొని కూడా ప్రయోజనం లేకుండా పోతుందని, అవసరమైతే ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపి సొంత పార్టీలోని ప్రత్యర్థులను ఓడించే అవకాశాలున్నట్లు రాబిన్ శర్మ బృందం నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ప్రకారమే టికెట్లు నిరాకరించాలని చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
పార్టీకి చేటు తెస్తున్న నోళ్లు
పోలీసులపై నోరు పారేసుకున్న అయ్యన్నపాత్రుడు గంటా ఏమైనా పెద్ద నాయకుడా? కష్టకాలంలో నిద్రపోయాడని, వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడంటూ బహిరంగంగా విమర్శలు చేశారు. కాబోయే హోం మంత్రినని, పోలీసుల బట్టలూడదీస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూర్చేవిగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అసెంబ్లీకి పోటీచేస్తానంటూ అధినేతపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. బాబు మాటను ససేమిరా అంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిలు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జనసేనతో పొత్తుంటుంది కాబట్టి ఏ నియోజకవర్గం కేటాయిస్తారో తెలియదు.. కాబట్టి ఇప్పటినుంచే అనవసరంగా ఖర్చుపెట్టడం ఎందుకు దండగ అనేరీతిలో వారి వ్యవహారశైలి ఉంది. మరోవైపు సీటు తనకే కావాలంటూ కావలి గ్రీష్మ పట్టుబట్టి కూర్చుంది. ప్రతిభా భారతి కుమార్తె అయిన గ్రీష్మ మహానాడులో తొడ గొట్టి ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా అవతరించారు. కొండ్రు మురళీకి కాదని, తనకే సీటివ్వాలంటూ పట్టుబడుతున్నారు.
నాయకుల మధ్య విభేదాలు
అచ్చెన్నాయుడు చాపకింద నీరులా తన వర్గాన్ని జిల్లాలో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. వారందరికీ సీట్లు ఖాయమని అచ్చెన్నే హామీ ఇచ్చేస్తున్నారు. మరోవైపు అచ్చెన్నాయుడికి, రామ్మోహన్ నాయుడికి మధ్య అంతర్గత విభేదాలు తలపోటును తెప్పిస్తున్నాయి. అశోక్ గజపతిరాజు, కళా వెంకట్రావు, సుజయకృష్ణ రంగారావు లాంటి నేతలంతా మౌనం వహించారు. సుజయకృష్ణ పార్టీలో ఉన్నారో? లేదో? కూడా తెలుగు తమ్ముళ్లకే తెలియదు. ఉత్తరాంధ్రలో రాజకీయ పరిస్థితులు టీడీపీ అనుకూలంగా ఉన్నప్పటికీ వాటిని తమవైపునకు తిప్పుకునే రాజకీయం చేయకుండా వారిలో వారే కలహించుకుంటూ పార్టీకి, అధినేతకు చెడ్డపేరు తెస్తున్నారు. ఈ తరహా నాయకులతో ఎన్నికలకు వెళితే గెలుపు ఎలా అని తమలో తామే ప్రశ్నించుకుంటున్నారు.