ముఖ్యమంత్రి జగన్ను ఢీకొడుతున్న బడా నిర్మాత? వ్యాపారమైనా మూసేసుకుంటా??
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తెచ్చి జీవో ప్రకారం జులై ఒకటోతేదీ నుంచి సినిమా థియేటర్లలో టికెట్ కలెక్షన్ నగదు ప్రభుత్వ ఖాతాకు వెళుతుంది. ఒక్కరోజు తేడాతో తిరిగి వాటిని ఆయా థియేటర్ యాజమాన్యానికి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ప్రకారం థియేటర్లతో ఎంవోయూ కుదుర్చుకోవడానికి ప్రభుత్వ సిబ్బంది వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ ఎగ్జిబిటర్లు మాత్రం ముందుకు రావడంలేదు. ప్రభుత్వం నయానో భయానో చెబుతున్నప్పటికీ వారంతా మొండికేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వ వైఖరివల్ల ఇబ్బందులు?
ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఎప్పటినుంచో డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉంది. ప్రతిచోటా కార్యాలయాలున్నాయి. సినిమాలు నిర్మించడంతోపాటు ఇతరులు నిర్మించిన సినిమాలను కూడా వారి డిస్ట్రిబ్యూషన్ద్వారా విడుదల చేస్తారు. ఏపీ, తెలంగాణలో థియేటర్లు లీజుకు తీసుకొని నడిపిస్తున్నారు. తెలంగాణ వరకు ఇబ్బంది లేకపోయినప్పటికీ ఏపీలో మాత్రం ప్రభుత్వం తెస్తున్న జీవోలవల్ల, ప్రభుత్వ వైఖరివల్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇబ్బంది పడుతోందని ఫిల్మ్నగర్ నగర్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
విశాఖలో స్థలం అడిగిన ప్రభుత్వం.. నిరాకరణ
ఇప్పటికే ఏపీలో మరికొన్ని థియేటర్లను లీజుకు తీసుకొని వాటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది రన్ చేస్తున్నారు. విశాఖపట్నంలో ఈ నిర్మాణ సంస్థకు చెందిన స్థలాన్ని ప్రభుత్వం గతంలోనే అడిగింది. అయితే ఆ నిర్మాత ఇవ్వడానికి నిరాకరించారు. అప్పటి నుంచి ప్రభుత్వం మధ్య, సదరు నిర్మాణ సంస్థ మధ్య అంతర్గత యుద్ధం నడుస్తోంది. కరోనా సమయంలో తాను నిర్మించిన సినిమాలను ఆ నిర్మాత ఓటీటీ సంస్థలకు ఇచ్చేశారు. ఇటీవలే ఒక సినిమాను మాత్రం థియేటర్లలో విడుదల చేశారు.
అవసరమైతే ఏపీలో వ్యాపారం మానుకుంటాం!!
ఎట్టి పరిస్థితుల్లోను విశాఖపట్నంలోని స్థలాన్ని ఇవ్వడానికి ఈ నిర్మాణ సంస్థ సిద్ధంగా లేదు. దీంతో వీరు విడుదల చేస్తున్న సినిమాలకు కూడా తక్కువ ధరలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందంటూ ఆయన ఆరోపిస్తున్నారు. అవసరమైతే వ్యాపారాన్ని ఏపీలో చేయకుండా మానుకుంటాంకానీ ప్రభుత్వంతో మాత్రం రాజీపడేది లేదని తన సన్నిహితవర్గాలవద్ద వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే.
2019 నుంచి సదరు నిర్మాణ సంస్థ ఏపీలో ఉన్న టికెట్ ధరలను దృష్టిలో ఉంచుకొని థియేటర్లలో విడుదల చేసినా గిట్టుబాటు కావన్న ఉద్దేశంతోనే నిర్మాణాలను తగ్గించింది. తీసిని చిత్రాలను కూడా ఓటీటీల్లోనే విడుదల చేస్తోంది. ప్రభుత్వానికి, సదరు నిర్మాణ సంస్థకు మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొనేలా చూడటానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అవి ఎంతవరకు విజయవంతమవుతాయో వేచిచూడాలి మరి.!!