కథా రచయిత ఎన్కె రామారావు కన్నుమూత
నల్లగొండ: ప్రముఖ కథా రచయిత ఎన్కె రామారావు(69) గురువారం తెల్లవారు జామున నల్లగొండలో కన్ను మూశారు. నల్లగొండ న్యాయస్థానంలో సూపరింటెండెంట్గా పనిచేసిన ఆయనకు బాల్యం నుంచే రచనల పట్ల ఎనలేని మక్కువ. రామారావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
కోదాడ మండలం కందిబండ గ్రామంలో జన్మించిన ఈయన రచనల్లో రావి శాస్త్రి, పతంజలి తరహా విశిష్టత గోచరిస్తుంది. నాటి ప్రజాతంత్రలో ప్రచురితమైన పదకేళిని శ్రీశ్రీ తర్వాత రామారావే కొనసాగించారు. కాంచనపల్లి చిన వెంకట రామారావు, మేరెడ్డి యాదగిరి రెడ్డిలతో కలిసి దర్శనం పత్రిక ఆవిష్కరణలో రామారావు కీలక భూమిక పోషించారు. నాటి యువ రచయితల్లో ముఖ్యుడిగా ఉన్న నోముల సత్యనారాయణతో కలిసి యువ కవులను రామారావు ప్రోత్సహించారు.

రామారావు రాసిన విద్యుల్లత కథల సంపుటి విశేషంగా పాఠకాదరణను పొందింది. అరసంలో కొంత కాలం సభ్యుడిగా ఉన్న రామారావు మృతి సాహిత్య రంగానికే తీరని లోటని రచయితలు, కవులు అన్నారు. వ్యంగ్య రచయిత శ్రీరమణకు ఆయన సన్నిహితులు. అలాగే బాపురమణలతో ఆయన సాన్నిహిత్యం చివరి వరకు కొనసాగింది. సినీ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, నటుడు కాంతారావులతో కూడా ఆయన సంబంధాలు ఉండేవి.
ఇటీవల సూర్యాపేటలో ఆయన బస్సు ప్రమాదంలో గాయపడ్డారు. షమ్మీ కపూర్ ఎన్కె రామారావు అభిమాన నటుడు. ముంబైకి ఆయన ప్రత్ేయకగా వెళ్లి రాజ్కపూర్, షమ్మీ కపూర్ల ఇంటర్వ్యూలతో ప్రత్యేకంగా వ్యాసాలు రచించి ప్రచురించారు.
ఎన్కె రామారావు మృతికి జిల్లాలోని సాహితి ప్రముఖులు, కళాకారులు సంతాపం ప్రకటించారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నోముల సత్యనారాయణ, బోయ జంగయ్య, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, బెల్లి యాదయ్య, బైరెడ్డి కృష్ణా రెడ్డి, డాక్టర్ పురుషోత్తమాచారి, పున్న అంజయ్య తదితరులు ఎన్కె రామారావు మృతికి సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications