తెలుగు సాప్ట్వేర్ ఇంజనీర్కు చెన్నైలో ఏడేళ్ల జైలు శిక్ష
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ సాప్ట్వేర్ ఇంజనీర్కు తమిళనాడు రాష్ట్రంలో ఏడేళ్ల పాటు జైలుశిక్ష పడింది. భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో ఓ తెలుగు సాప్ట్వేర్ ఇంజనీర్కు అక్కడి మహిళా న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పుని వెలువరించింది.
వివరాల్లోకి వెళితే.... ఆంధ్రప్రదేశ్లోని చిత్తారు జిల్లాకు చెందిన పెంచిల నరసింహులు (28) సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. నరసింహులుకు అదే జిల్లాకు చెందిన స్వరూపతో 2012లో వివాహం జరిగింది. వివాహం అనంతరం దంపతులిద్దరూ చెన్నైలోని కేకే నగర్లో కాపురం పెట్టారు.
కొన్నాళ్ల పాటు సాఫీగానే వీరి సంసార జీవితం కొనసాగింది. ఆ తర్వాతే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం నరసింహులు తరచుగా స్వరూపను వేధించేవాడు. ఈ క్రమంలో వీరిద్దరి గొడవపడేవారు.
చివరకు భర్త వేధింపులు తట్టుకోలేక 2013 సెప్టెంబర్ 13న స్వరూప ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతేకాదు తన చావుకి కారణం తన భర్తేనంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది. దీంతో ఈ ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపిన అశోక్నగర్ పోలీసులు నరసింహులపై వరకట్న కేసు నమోదు చేశారు.
ఈ కేసు ఇటీవలే మద్రాసు మహిళా న్యాయస్థానంలో న్యాయమూర్తి కలైమది సమక్షంలో విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరుపున మహిళా న్యాయవాది గౌరి అశోకన్ హాజరై కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఈ విచారణలో భర్తే స్వరూప ఆత్మహత్య చేసుకోవడానికి కారణమని నేరం నిరూపితమైంది.
దీంతో పెంచిల నరసింహులకు ఏడేళ్లు జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.